‘ఎన్టీయార్ అంటే రాముడు. నేను ఆయన దగ్గర పని చేసిన లక్ష్మణుడిని. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే హృదయం బరువెక్కి వారం రోజుల పాటు తిండి తినబుద్ధే కాదు…’ అంటారు క్యాతం లక్ష్మణ్. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీయార్ 90వ జయంతి సందర్భంగా ఆయన కారు డ్రైవర్ లక్ష్మణ్ అనుభూతులూ అనుభవాలూ…
“నేను ప్రొటోకాల్ డిపార్ట్మెంట్లో మామూలు డ్రైవర్ని. ఒకరోజు మా డిపార్ట్మెంట్ వాళ్లు పిలిచి సీఎం దగ్గర డ్రైవర్గా పంపించారు. ఎన్టీయార్గారికి నచ్చడంతో డ్యూటీకి రమ్మన్నారు. ఇక అప్పట్నుంచి పద్నాలుగున్నరేళ్లు ఆయన దగ్గరే పని చేశాను. అన్నేళ్లలో ఏ ఒక్కరోజూ ఆయన నన్ను కోప్పడలేదు. అంతేకాదు, తన సిబ్బందిని బయటవాళ్లు ఒక్కమాటన్నా సహించేవారు కాదు, చివరకు ఆయన సొంత పిల్లలైనా. క్రమశిక్షణ, పట్టుదల ఆయన దగ్గర నేను నేర్చుకున్న గుణాలు.
ఎన్టీయార్ తన ఏ అవసరాలకూ ప్రభుత్వ సొమ్ము వాడేవాళ్లు కాదు.
ఆయన ఖర్చులు ఆయనే పెట్టుకునే వారు. ప్రభుత్వం నుంచి ఆయన తీసుకున్న కారు కూడా ఒక్కటే. కుటుంబసభ్యులు కూడా దాన్ని వాడేందుకు అస్సలు ఒప్పుకునేవారు కాదు. తమ సొంత కార్లనే వాడుకోమనే వారు. ఒకసారి జయబాబు ఏదో పని మీద మా కార్లో వచ్చారు. “నాన్నగారూ మిమ్మల్ని సెక్రటేరియట్లో దింపి నేను ఆబిడ్స్లో దిగిపోతాను” అన్నారు. దానికి సారు.. “ఇది సీఎం కారు. మీ వ్యక్తిగత అవసరాలకు కాదు” అన్నారు. అంతెందుకు సీఎం ఇంటి నుంచి బయటకు వెళ్లే ఫోన్ కాల్స్ విషయంలో కూడా పట్టుదలగా ఉండేవారు. తన ఆఫీసు నుంచి ఎవరెవరు ఫోన్ చేశారో ఆ లిస్టంతా పీఏతో ఉదయమే తెప్పించుకొని పరిశీలించేవారు.
కుటుంబ సభ్యులెవరైనా ఆ ఫోన్ని వాడితే మందలించేవారు. ప్రభుత్వ సొమ్ము వృధా చేయొద్దనే వారు. సార్ దగ్గర పని సూర్యోదయానికి ముందే షురువయ్యేది. ఉదయం నాలుగు గంటలకు ఆయన ఇంటి వద్ద ఉండాలి. గండిపేట లేదా నాచారం.. కొంతకాలం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 13లో ఉన్నారు. అక్కడి నుంచి ఆబిడ్స్ వచ్చేవాళ్లం. ఇంట్లో కారెక్కగానే భగవద్గీత లేదా శివస్తుతులు వినేవారు. ఆబిడ్స్కి రాగానే అక్కడ సుప్రభాతం. ఇల్లంతా సాంబ్రాణి పొగలతో నిండి ఉండేది. మాకు ఏదో పవిత్ర స్థలానికి వచ్చిన అనుభూతి కలిగేది. అక్కడో రెండు గంటలు పని చూసుకున్నాక ఏడింటికే సెక్రటేరియేట్ వెళ్దామనే వారు.
ఇంకా స్టాఫ్ ఎవరూ రారు సార్.. ఎనిమిది తర్వాత వెళ్దాం అంటే సరేననేవారు. లలిత కళా తోరణం, ట్యాంక్బండ్ మీద విగ్రహాల పని నడుస్తున్నంత కాలం ప్రతి రోజు అక్కడికి వెళ్లాల్సిందే. ఆ పనులు స్వయంగా చూడాల్సిందే. ట్యాంక్బండ్ మీది విగ్రహాలనైతే ఎంతో సునిశితంగా పరిశీలించేవారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడు ఆ విగ్రహాల నమూనాలను పట్టి పట్టి చూసేవారు. తనకు సంతృప్తి కలిగే వరకు నమూనాల్ని మార్పించేవారు.
మీరు రాజులు ప్రజలు పేదలు
ఒకరోజుమంత్రి అశోక గజపతిరాజుని సార్ కార్లో కూర్చోబెట్టుకున్నారు. ‘బ్రదర్.. ఏంటి విశేషాలు’ అని అడిగారు. ఆయన కొన్ని కబుర్లు చెప్పి ‘రెండు రూపాయలకు కిలో బియ్యంతో ఖజానా మీద చాలా భారం పడుతోంది. కొంచెం రేటు పెంచుదామా’ అన్నారు. అంతే… సార్ సీరియస్ అయిపోయారు. “ఏం బ్రదర్ ఏంటి మీరు మాట్లాడుతున్నది. మీరు రాజులు. ప్రజలు పేదలు. వీలైతే మరింత తగ్గించవచ్చేమో చెప్పండి . పెంచమని సలహాలు ఇవ్వకండి’ అని ఆగ్రహంగా అన్నారు. అంతే ఇక సెక్రటేరియేట్లో బండి దిగేవరకు అశోక గజపతిరాజు ఒక్క మాట మాట్లాడలేదు. ‘ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సెంటు భూమి సస్యశ్యామలం కావాలి లచ్చన్నా’ అంటూ ఉండేవారు ఎన్టీయార్.
హైదరాబాద్లో రోడ్డు విస్తరణ పనుల సమయంలో కూడా చాలా పట్టుదలతో వ్యవహరించారు. ఉదయం మూడు గంటలకే రోడ్ల మీదకు వచ్చేవారు. ఆయనతో పాటు అధికారులు కూడా. ‘చార్మినార్ కింద కూర్చుని చూస్తే ఫలక్నుమా ప్యాలెస్ కనిపించాలి. రోడ్డు అలా తీర్చిదిద్దండి’ అనేవారు. ఒకసారి చార్మినార్ దగ్గరున్న యునాని ఆసుపత్రి పైకి వెళ్లాం. అక్కడ రోడ్డు విస్తరణ ప్రయత్నం చేస్తున్నారు. షాపులు, తోపుడు బండ్ల వాళ్లు, ఎంఐఎం కార్యకర్తలూ, నాయకులూ వచ్చేశారు. ఎన్టీయార్ డౌన్డౌన్ అనే నినాదాలు మొదలయ్యాయి. సార్ కిందికి వచ్చారు. మల్గీల వాళ్లని పిలవమన్నారు. వాళ్లతో ‘మీకొచ్చిన నష్టం ఏముంది? రోడ్డు వెడల్పు చేశాక మల్గీలు కట్టిస్తాం.
అవి మీకే అప్పజెప్పుతాం. మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు’ అని నచ్చజెప్పారు. అక్కడే ఉన్న అధికారులతో వాళ్ల పేర్లు నమోదు చేసుకోమన్నారు. దాంతో వెంటనే ‘ఎన్టీయార్ జిందాబాద్’లు మిన్నుముట్టాయి. నిజాం కాలేజీ రోడ్డు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్న గుడిని చూసి ‘లచ్చన్నా ఇక్కడ గుడి ఇంతకుముందు లేదు కదా. కొత్తగా వచ్చినట్లుందే’ అన్నారు. ‘అవున్సార్ ఇక్కడ నిజాం కాలేజీ వాచ్మెన్ రూం ఉండేది.’ అన్నాను. ‘లచ్చన్నా దీన్ని కూల్పించేయ్! నీ విగ్రహం ట్యాంక్బండ్ మీద పెడతా’ అన్నారు. అదే వాహనంలో ఉన్న ఆనాటి పోలీస్కమిషనర్ విజయరామారావు గట్టిగా నవ్వేశారు. ‘సార్ నా వల్ల కాదు’ అన్నాను మెల్లగా. రోడ్డుకు అడ్డంగా అప్పటికప్పుడు వెలసిన గుడులన్నా, మసీదులన్నా కోపంగా ఉండేది ఎన్టీయార్గారికి.
తప్పును ఒప్పుకునే మనిషి
ఎవరైనా తప్పు చేస్తే ఎంత సున్నితంగా మందలించే వారో, తాను తప్పు చేస్తే అంతే నిజాయితీగా ఒప్పుకునే వారు సార్. ఒకరోజు ఆబిడ్స్ ఇంట్లో ఉన్నాం. మధ్యాహ్నం రెండింటికి సెక్రటేరియట్ వెళ్దామని చెప్పారు. టైముంది కదా అని నాకు తెలిసిన వాళ్లొస్తే పక్కకు వెళ్లి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఈ లోపున సార్ కారు దగ్గరకు వచ్చేశారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను. ‘ఏంటీ ఎటువెళ్లారు’ అని అడిగారాయన కొంచెం కోపంగా. క్షణం ఆలస్యమైనా సహించరు ఆయన. క్రమశిక్షణ గల మనిషి. సార్ రెండు గంటలకు వెళ్దామన్నారు కదా. ఇపుడు ఒకటిన్నరే అయ్యింది అని వాచీ చూపించాను. దానికాయన ‘సారీ లచ్చన్న, నిద్ర పట్టలేదు. అందుకే తొందరగా బయలుదేరాను’ అన్నారు.
అప్పుడేకాదు ఆయన కుటుంబ సభ్యులుగానీ, అధికారులు, నాయకులుగానీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు అని తెలిస్తే చాలు సారీ చెప్పేవారు. ‘మీరు పెద్దవాళ్లు..’ అన్నాగానీ తప్పు తప్పే అనేవారు. ఒకసారి ఆబిడ్స్ నుంచి జూబ్లీహిల్స్ ఇంటికి వెళ్తున్నాం. తాజ్కృష్ణా అప్లోకి రాగానే.. ‘లచ్చన్నా.. బాబు పాలన ఎలా ఉందీ’ అని అడిగారు. ‘రాజకీయాల గురించి నాకేంతెల్సు సార్’ అన్నాను. ‘బయట అనుకుంటారుగా’ అన్నారు. దాంతో నేను ‘బాగానే ఉంది సార్’ అన్నాను. ‘బాబు రాజకీయ చాణుక్యుడులే’ అన్నారు. ఆ మాటల సందర్భంలోనే నేను కొంచెం చొరవ తీసుకున్నాను. ‘మన దగ్గరా తప్పులున్నాయి కదా సార్’ అంటూ ‘ఎంతో తపోశక్తి కలిగిన రావణాసురుడు సీతను చెర పట్టగానే పేరు చెడిపోయింది కదా సార్’ అన్నాను. ఆయన ‘అందరూ అన్నారు లచ్చన్నా. నీవొక్కడివే మిగిలిపోయావనుకున్నా. చివరకు నువ్వూ అనేశావు’ అనే ఒక్కమాట మాట్లాడి తల కిందికి దించేసుకున్నారు. ఇంటి వద్ద దిగే వరకు మళ్లీ ఆయన తలపైకెత్తలేదు. ఆయనలోని సంస్కారం అలాంటిది. అట్లాంటి లీడర్లని ఇప్పుడు చూస్తామా?
ఆప్యాయంగా చూసేవారు
ఆయన దగ్గర పని అంటే మా ఇంట్లో పని చేసుకున్నట్లే ఉండేది. అంతటి ఆప్యాయత చూపేవారు. ‘లచ్చన్నా భోజనం చేశారా? ఏం తెచ్చుకున్నారు? ఇంత చిన్న బాక్సు ఏం సరిపోతుందీ?’ అని పలకరించేవారు. ఆయన కార్లో ఏదైనా తింటూంటే గేర్ రాడ్ మీద ఉన్న నా చేయిని కొట్టి ‘ఊ’ అని సైగ చేసి నాకూ పెట్టేవారు. భోజన ప్రియుడు. ఉదయం నాలుగు గంటలకే ఓ కోడి, చిక్కగా మరగబెట్టిన లీటర్ పాలు, రాత్రి కిలో చేపలు, సాయంత్రం రసమలై, కోవా గర్జ్, అపుడపుడు పల్లీలు, బెల్లం… ఇట్లా మంచి బలమైన ఆహారం తీసుకునేవారు. ప్రతి ఆదివారం కొడుకులూ, కూతుళ్లూ, మనువలూ, మనవరాళ్లందరినీ పిలిచి అందరితో కలిసి భోంచేసేవారు. సార్ తిరిగి అధికారంలోకి వస్తే సత్యనారాయణస్వామి వత్రం చేస్తానని నా భార్య మొక్కుకుంది. ఆయన విజయం సాధించారు.
వ్రతం విషయం చెప్పాను. ‘నేను వస్తాను’ అన్నారు. మంచిది సార్ అన్నాను కానీ నాకు నమ్మకం లేకుండె. కానీ ఆయన నిజంగానే వచ్చారు. ఏ ఫంక్షన్లో కూడా కొద్ది నిమిషాలకు మించి ఉండని ఆయన రెండు గంటల పాటు నా ఇంట్లో ఉన్నారు. పార్సీ గుట్టలో చిన్న రెండు గదుల ఇల్లు నాది. వచ్చేముందు ఫోన్ చేసి ఏమేం వంటకాలు చేయించారని అడిగారు. ఆలు ఫ్రై, పప్పు, సాంబారు అని చెప్పాను. వచ్చి భోంచేశారు. నా పిల్లల్ని దీవించారు. నాకు బట్టలు కూడా పెట్టారు. అవి నేను కుట్టించుకోలేదు. నేను చనిపోయినప్పుడు వాటిని నా శవం మీద కప్పాలని నా కోరిక. మా నాన్న చనిపోయినపుడు కారు ఇచ్చి మరీ నన్ను ఇంటికి పంపించారు. కార్యక్రమాలన్నీ చూసుకొని రండి అని చెప్పారు. ఆ పదిరోజులే నేను ఆయన వద్ద పనిచేసిన కాలంలో డ్యూటీకి దూరంగా ఉన్నది. అలాంటి మనిషి మళ్లీ పుట్టడు.
అభిమానులంటే గౌరవం..
సార్ ఎంత బిజీగా ఉన్నా అభిమానులకూ, అవసరం రీత్యా వచ్చిన వారికి టైమ్ ఇచ్చేవారు. ఒకసారి ఆదిలాబాద్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. లంబాడీ. ఆజానుబాహుడు. ఆయన్ను చూసి ఎందుకొచ్చారని అడిగారు సార్. ‘నా కూతుర్ని చెట్టుకు కట్టేసి చెరిచారు. ఫిర్యాదు ఇస్తే పోలీసులు స్పందించడం లేద’ని చెప్తే 24 గంటలు తిరగక ముందే నిందితుల్ని అరెస్ట్ చేయించి, అక్కడి పోలీసు అధికారిని సస్పెండ్ చేయించారు. ఎక్కడైనా అన్యాయం జరిగిందని చెవినబడితే వెంటనే స్పందించేవారు. యాక్షన్ తీసుకునే వరకు మర్చిపోకుండా అధికారుల్ని ఆరా తీసేవారు.
ఆబిడ్స్ నివాసానికి సార్ని చూసేందుకు చాలా మంది వచ్చేవారు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని సార్కి తెలియనిచ్చేవారు కాదు. ప్రతిరోజు మేము ఇంట్లోంచి బయలుదేరగానే వెనుక మూడు, నాలుగు బస్సులు ఫాలో అయ్యేవి. అందరూ అభిమానులే. సార్ని ఒక్కక్షణమైనా చూద్దామని వాళ్ల కోరిక. నేనొకరోజు ఈ విషయాన్ని సార్కి చెప్పాను. ఆయన మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేసి అభిమానుల్ని కలిసారు. ఆ తర్వాత ఆబిడ్స్లో వాళ్లకో పెద్ద హాలు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి.. ఏవైనా ఫిర్యాదులుంటే స్వీకరించే ఏర్పాట్లు చేయించారు. ప్రతిరోజు ఒకసారి అక్కడికి వెళ్లి వాళ్లందర్నీ చూసి చేయి ఊపి వెళ్లేవారు.
అలాంటి మనిషి డల్ అయితే…
ఎప్పుడూ హుషారుగా ఉండేవారాయన. సెక్యూరిటీవాళ్లు వచ్చి డోర్ తీసేలోపు జింకపిల్లలా చటుక్కున స్వయంగా డోర్ తీసుకొని కూర్చునేవారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్లినా అంతే. నేను కారు రివర్స్ తీసుకునే లోపున తిరిగి వచ్చేసేవారు. ఎంతో వేగంగా, చలాకీగా ఉండేవి ఆయన పనులు. అలాంటి వ్యక్తి చివరి రోజుల్లో చాలా డల్ అయ్యారు. చాలా నెమ్మదిగా కారు దిగేవారు. కిందికి దిగడానికి నేను సాయం పట్టాల్సిన పరిస్థితి.
– పి. శశికాంత్
వర్గం: జ్ఞాపకాలు
బ్రిటిష్ దొరగారి గారాల భారతీయుడు
మంచి చేసే వాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు..
బాపూ గారు మాట్లాడేరు !!!
విధ్వంసంలో మనిషి మనుగడెక్కడ?-కాకర్ల సుబ్బారావు.
డాక్టర్గా, ప్రొఫెసర్గా, నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్గా, బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్గా కొన్ని ద శాబ్దాల పాటు రాష్ట్రానికి, ఎంతో మంది రోగులకు సేవలందించిన వ్యక్తి కాకర్ల సుబ్బారావు. దేశవిదేశాల్లో ఎన్నో గురుతర బాధ్యతల్ని నిర్వహించిన ఆయన 88 ఏళ్ల వయసులోనూ ఓ విద్యాసంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన సుదీర్ఘజీవన ప్రస్థానంలో ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’.
‘ఒక రకం సిద్ధాంతాన్ని ఎంచుకుని, అందుకు విరుద్ధంగా అడుగులు వేయడంలో కలిగే బాధేమిటో అనుభవించిన వారికే తెలుస్తుంది. కృష్ణాజిల్లాలోని పెద్ద ముత్తేవి నా జన్మస్థలం. నా ప్రాథమిక విద్యాభ్యాసం చల్లపల్లి రాజా వారి హైస్కూల్లో జరిగింది. సాయంత్రం వేళ స్కూలు హాస్టల్లోనే చండ్ర రాజేశ్వరరావు, మరికొంత మంది పెద్దలు అక్కడి విద్యార్ధులందరికీ కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి, మార్క్సిజం గురించి చెబుతుండే వారు. పక్కా గాంధేయవాది అయిన నా మిత్రుడి ప్రభావమో ఏమో నా మనసు మాత్రం గాంధేయవాదం వైపే మొగ్గు చూపేది. 1940లో.. గాంధీ గారి పిలుపుతో మనం కూడా సత్యాగ్రహం చేద్దామని నా మిత్రుడన్నాడు. నా చదువు, పురోగతి మీద నా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే సామాజిక కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం నాకు ఇష్టముండేది కాదు. కాకపోతే గాంధేయవాదం మీద అభిమానంతో మేము చిన్నచిన్న నాటకాల్లో పాలుపంచుకునే వాళ్లం. అది కూడా చల్లపల్లి రాజా అయిన యార్లగడ్డ శివరామ ప్రసాద్ రాజు గారికి నచ్చేది కాదు. ఒక రోజు ఆయన మేనేజర్ మమ్మల్ని పిలిచి ‘బాబూ ఇలాగైతే చాలా కష్టం. ఇక ముందెప్పుడూ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే మంచిది’ అన్నాడు. ఆ తరువాత మేమింక మౌనంగా ఉండిపోయాం.
హింసతో ఏం చేద్దామని..
కాలేజీకి వచ్చాక.. 1941-42లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యింది. మేమూ అనుసరించాం. గాంధీ ఉపవాసదీక్ష చేస్తే మేమూ చేసేవాళ్లం. మమ్మల్ని ఏ అంశం ప్రభావితం చేసిందో ఏమో కానీ గాంధీ గారి సిద్ధాంతానికి విరుద్ధంగా ఒకరోజు విద్యార్థులమంతా కలిసి చల్లపల్లి రైల్వేస్టేషన్కు వెళ్లి పట్టాల్ని తొలగించేందుకు సిద్ధమయ్యాం. పని ప్రారంభించగానే పోలీసులు వచ్చారు. ఏం జరుగుతుందోనని మాలో ఒకటే ఉత్కంఠ. ఉన్నట్టుండి మాలో కొందరు వాళ్ల మీదికి రాళ్లు విసిరారు. ఓ రాయి పోలీస్ కానిస్టేబుల్ నుదుటికి తాకింది. రక్తంతో దుస్తులు తడిచిపోయాయి. ఊహించని పరిణామంతో నిశ్చేష్టుడినయ్యాను. ఇలాంటి హింసాత్మక కార్యాల్లో నేనెందుకు పాల్గొనాలి? అని నాలో నేనే మధనపడ్డాను. వెంటనే అక్కడి నుంచి తప్పుకుని వచ్చేశాను. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. నేను భయపడి పారిపోయానని అందరూ తిట్టుకున్నారు. నేను అవేమీ పట్టించుకోలేదు. హింస ఏ వైపున జరిగినా తప్పే కదా! గాంధీగారి అహింసా సూత్రాన్ని నేను ఇప్పుడూ అంతే బలంగా నమ్ముతాను.
పేషెంట్దే పెద్దమాట
అమెరికాలో చదువుకోవాలనే కోరిక నాలో బలంగా ఉండేది. వైజాగ్లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ కోసం అమెరికా వెళ్లాను. పేషంట్ చెప్పే విషయాల్ని వినేందుకు ఇక్కడ మన డాక్టర్లు విసుగుపడతారు. కానీ అమెరికాలో పరిస్థితి వేరు. డాక్టర్, పేషంట్ల మధ్య పరస్పర గౌరవభావం ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదే కావడం వల్లనో ఏమో.. పేషంట్ల మాటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే వారి ఆలోచనా విధానం నాకు బాగా నచ్చేది. డాక్టర్ అన్ని వ్యా«ధుల మీదా కొంతే మనసు పెడతాడు. కానీ పేషంట్ తనకున్న ఒక్క వ్యాధి గురించి ఎంతో లోతుగా తెలుసుకుంటాడు.
ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల మరింతగా తెలుసుకోగలుగుతున్నాడు. డాక్టర్ కన్నా బాగా విద్యావంతుడైన రోగి బెటర్ అని అంటాన్నేను. ఓ రోజు ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన భార్యను ఒక న్యూరాలజిస్టు వద్దకు తీసుకువచ్చాడు. ‘నా భార్యకు వచ్చిన వ్యాధి ఏంటి? దానికి కారణమేంటి?’ అంటూ అతనేదో అడిగితే, ‘ఆ జబ్బు గురించి మీకు అర్థం కావాలంటే ఐదేళ్లు పడుతుంది’.. అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఆ డాక్టరు. విదేశాల్లో ఎప్పుడూ అలా మాట్లాడరు. వివరించి చెప్పేంత సమయం లేకపోతే దానికి సంబంధించిన పత్రికలో, పుస్తకాలో సూచిస్తారు. కానీ ఇలా దాటవేసే ప్రయత్నం చేయరు. ఈ విషయంలో నేను విదేశీయుల నుంచి చాలా నేర్చుకున్నాను.
అప్పటికి అదే మేలు
కొందరు పేషంట్లు వేసే ప్రశ్నలు వింతగా ఉండేవి. నేను రేడియాలజిస్టును కదా. 1960లో.. ఎక్స్రే ప్రాక్టీస్ చేస్తున్నాను. గర్భిణులకు ఎక్స్-రే తీసే సందర్భంలో మాకు ఎప్పుడూ ఓ ప్రశ్న ఎదురయ్యేది. పుట్టేది ఆడపిల్లా? మగపిల్లాడా? అని గుచ్చిగుచ్చి అడిగేవారు. మాకు తెలియదని చెప్పినా, మౌనంగా ఉన్నా.. ‘పుట్టబోయేది ఆడపిల్లే కావచ్చు.. అందుకే డాక్టర్ ఏమీ చెప్పడం లేదు’ అనే అభిప్రాయానికి వచ్చేవారు. ఆ రోజు నుంచే ఆమె ఆహార పానీయాల విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉండేవారు.
దీంతో ఎవరైనా అడిగితే తడుముకోకుండా మగపిల్లాడే అని చెప్పేవాడ్ని. అప్పట్నుంచి ఆమె కుటుంబసభ్యులంతా ఆమె ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించేవారు. నేను చెప్పినదానికి విరుద్ధంగా ఆడశిశువు పుడితే నన్నెవరూ నిలదీయలేదు కానీ, మగబిడ్డ పుట్టినవాళ్లు మాత్రం.. మీరు చెప్పినట్టే జరిగిందని నాకు స్వీట్ పాకెట్లు ఇచ్చేవాళ్లు. వాళ్ల మాటలు విని నవ్వుకునే వాడిని. అలా చెప్పడం ఇప్పుడు చట్ట విరుద్ధమే కానీ, ఆ రోజుల్లో ఆ మాటే ఎంతో మేలు చేసేది. ‘పడగొట్టే సత్యం కన్నా నిలబెట్టే అబద్దమే గొప్పది’.. అనే శ్రీకృష్ణుడి మాటలు నాకు పదేపదే గుర్తుకొచ్చేవి.
నియంత్రణ లోపిస్తే నిలకడేది?
హైదరాబాద్లోని షేక్పేట్లో మా మామయ్య వాళ్లుండే వాళ్లు. అక్కడ వారికి 18 ఎకరాల భూమి ఉండేది. అందులో రాళ్లే ఎక్కువ. ఎలాగోలా చదును చేసి ద్రాక్షతోట వేసే వాళ్లం. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఆబిడ్స్లో క్లినిక్ కూడా ఉండేది. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఓ రోజు రాత్రి ఆ తోటంతా నరికివేశారు. తరువాత కొద్ది రోజులకే మా ఇంటికి నిప్పంటించారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. మనసు చెదిరిపోయింది. ఇక ఇక్కడ ఉండాలనిపించలేదు. ప్రొఫెసర్గా ఉద్యోగం చూసుకుని 1970లో అమెరికా వె ళ్లిపోయాను.
రెండేళ్లు గడిచాక తిరిగి వచ్చేద్దామనుకునే సరికి ‘జై ఆంధ్ర’ ఉద్యమం మొదలయ్యింది. దీంతో 1985 వరకు.. అంటే ఎన్టీఆర్ రమ్మని పిలిచేదాకా అక్కడే ఉండిపోయాను. ఉద్యమాలకు నేను వ్యతిరేకం కాదు. అన్యాయం జరిగితే, జరిగిందనిపిస్తే ఉద్యమాలు రావచ్చు. కానీ, అవి విధ్వంసకరంగా, హింసాత్మకంగా మారొద్దన్నది నా అభిప్రాయం. ఆలోచనాపరులెవరూ అలాంటి చర్యలకు పాల్పడకపోవచ్చు. ఉద్యమ నాయకులూ అందుకు ప్రోత్సహించకపోవచ్చు. కానీ, అలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా నియంత్రించే బాధ్యత మేధావులది, ఉద్యమ నాయకులది కూడా. హింస, విధ్వంసాలు జరిగిన చోట మానవ సంబంధాలకు మనుగడ ఉండదని నా అనుభవంలో తెలిసొచ్చింది.
చిన్నవే అనుకుంటే చితికిపోతాం..
అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో ఓసారి బస్సెక్కాను. బస్సులో ఉండే మెషీన్లో మూడు నాణాలు వేస్తే టికెట్ వస్తుంది. తీరా చూస్తే నా వద్ద రెండు నాణాలే ఉన్నాయి. డాలర్స్ ఉన్నాయి కానీ, నాణాలే వేయాలి. అత్యవసరంగా వెళ్లాలి. అప్పటికే ఆలస్యమయింది. మరో నాణెం దొరక్కపోతుందా అని జేబులన్నీ తడిమి చూశాను. లేదు. ఇక లాభం లేదనుకుని, నన్ను నేనే తిట్టుకుని బస్సు దిగేందుకు ఓ అడుగు వేశాను. ఎప్పటినుంచి గమనిస్తున్నాడో ఓ 14 ఏళ్ల బ్లాక్ కుర్రాడు ఓ నాణెం తీసి ఇచ్చాడు. చిరునవ్వుతో నన్నే చూస్తున్న ఆ పిల్లాడిని సంభ్రమాశ్చర్యాలతో చూశాను. నాణెం తీసుకుని డాలర్ ఇవ్వబోతే వద్దని తలూపాడు. వాళ్ల భాష రాకపోవడం వల్ల కృతజ్ఞతగా కరచాలనం చేశాను.
జీవితంలో ప్రతి విషయం పట్లా ఎంతో జాగ్రత్తగా ఉంటామనుకుంటూనే ఎలాంటి పొరపాట్లు చేస్తామో నాకు ఆ రోజు స్పష్టంగా బోధపడింది. జీవన గమనాన్ని ఆపడానికి పెద్ద తప్పులే చేయనవసరం లేదు. చాలా చిన్నతప్పు వల్ల కూడా ఒక్కోసారి జీవితం స్తంభించిపోతుందని ఆ రోజు స్పష్టమయింది. ఆ సత్యమే నన్ను మరింత జాగ్రత్తగా ఉండేలా మార్చింది.
బమ్మెర