అట్లాంటి లీడర్లనిప్పుడు చూస్తామా?

‘ఎన్టీయార్ అంటే రాముడు. నేను ఆయన దగ్గర పని చేసిన లక్ష్మణుడిని. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే హృదయం బరువెక్కి వారం రోజుల పాటు తిండి తినబుద్ధే కాదు…’ అంటారు క్యాతం లక్ష్మణ్. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీయార్ 90వ జయంతి సందర్భంగా ఆయన కారు డ్రైవర్ లక్ష్మణ్ అనుభూతులూ అనుభవాలూ…
“నేను ప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో మామూలు డ్రైవర్ని. ఒకరోజు మా డిపార్ట్‌మెంట్ వాళ్లు పిలిచి సీఎం దగ్గర డ్రైవర్‌గా పంపించారు. ఎన్టీయార్‌గారికి నచ్చడంతో డ్యూటీకి రమ్మన్నారు. ఇక అప్పట్నుంచి పద్నాలుగున్నరేళ్లు ఆయన దగ్గరే పని చేశాను. అన్నేళ్లలో ఏ ఒక్కరోజూ ఆయన నన్ను కోప్పడలేదు. అంతేకాదు, తన సిబ్బందిని బయటవాళ్లు ఒక్కమాటన్నా సహించేవారు కాదు, చివరకు ఆయన సొంత పిల్లలైనా. క్రమశిక్షణ, పట్టుదల ఆయన దగ్గర నేను నేర్చుకున్న గుణాలు.
ఎన్టీయార్ తన ఏ అవసరాలకూ ప్రభుత్వ సొమ్ము వాడేవాళ్లు కాదు.
ఆయన ఖర్చులు ఆయనే పెట్టుకునే వారు. ప్రభుత్వం నుంచి ఆయన తీసుకున్న కారు కూడా ఒక్కటే. కుటుంబసభ్యులు కూడా దాన్ని వాడేందుకు అస్సలు ఒప్పుకునేవారు కాదు. తమ సొంత కార్లనే వాడుకోమనే వారు. ఒకసారి జయబాబు ఏదో పని మీద మా కార్లో వచ్చారు. “నాన్నగారూ మిమ్మల్ని సెక్రటేరియట్‌లో దింపి నేను ఆబిడ్స్‌లో దిగిపోతాను” అన్నారు. దానికి సారు.. “ఇది సీఎం కారు. మీ వ్యక్తిగత అవసరాలకు కాదు” అన్నారు. అంతెందుకు సీఎం ఇంటి నుంచి బయటకు వెళ్లే ఫోన్ కాల్స్ విషయంలో కూడా పట్టుదలగా ఉండేవారు. తన ఆఫీసు నుంచి ఎవరెవరు ఫోన్ చేశారో ఆ లిస్టంతా పీఏతో ఉదయమే తెప్పించుకొని పరిశీలించేవారు.
కుటుంబ సభ్యులెవరైనా ఆ ఫోన్‌ని వాడితే మందలించేవారు. ప్రభుత్వ సొమ్ము వృధా చేయొద్దనే వారు. సార్ దగ్గర పని సూర్యోదయానికి ముందే షురువయ్యేది. ఉదయం నాలుగు గంటలకు ఆయన ఇంటి వద్ద ఉండాలి. గండిపేట లేదా నాచారం.. కొంతకాలం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 13లో ఉన్నారు. అక్కడి నుంచి ఆబిడ్స్ వచ్చేవాళ్లం. ఇంట్లో కారెక్కగానే భగవద్గీత లేదా శివస్తుతులు వినేవారు. ఆబిడ్స్‌కి రాగానే అక్కడ సుప్రభాతం. ఇల్లంతా సాంబ్రాణి పొగలతో నిండి ఉండేది. మాకు ఏదో పవిత్ర స్థలానికి వచ్చిన అనుభూతి కలిగేది. అక్కడో రెండు గంటలు పని చూసుకున్నాక ఏడింటికే సెక్రటేరియేట్ వెళ్దామనే వారు.
ఇంకా స్టాఫ్ ఎవరూ రారు సార్.. ఎనిమిది తర్వాత వెళ్దాం అంటే సరేననేవారు. లలిత కళా తోరణం, ట్యాంక్‌బండ్ మీద విగ్రహాల పని నడుస్తున్నంత కాలం ప్రతి రోజు అక్కడికి వెళ్లాల్సిందే. ఆ పనులు స్వయంగా చూడాల్సిందే. ట్యాంక్‌బండ్ మీది విగ్రహాలనైతే ఎంతో సునిశితంగా పరిశీలించేవారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడు ఆ విగ్రహాల నమూనాలను పట్టి పట్టి చూసేవారు. తనకు సంతృప్తి కలిగే వరకు నమూనాల్ని మార్పించేవారు.
మీరు రాజులు ప్రజలు పేదలు
ఒకరోజుమంత్రి అశోక గజపతిరాజుని సార్ కార్లో కూర్చోబెట్టుకున్నారు. ‘బ్రదర్.. ఏంటి విశేషాలు’ అని అడిగారు. ఆయన కొన్ని కబుర్లు చెప్పి ‘రెండు రూపాయలకు కిలో బియ్యంతో ఖజానా మీద చాలా భారం పడుతోంది. కొంచెం రేటు పెంచుదామా’ అన్నారు. అంతే… సార్ సీరియస్ అయిపోయారు. “ఏం బ్రదర్ ఏంటి మీరు మాట్లాడుతున్నది. మీరు రాజులు. ప్రజలు పేదలు. వీలైతే మరింత తగ్గించవచ్చేమో చెప్పండి . పెంచమని సలహాలు ఇవ్వకండి’ అని ఆగ్రహంగా అన్నారు. అంతే ఇక సెక్రటేరియేట్‌లో బండి దిగేవరకు అశోక గజపతిరాజు ఒక్క మాట మాట్లాడలేదు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి సెంటు భూమి సస్యశ్యామలం కావాలి లచ్చన్నా’ అంటూ ఉండేవారు ఎన్టీయార్.
హైదరాబాద్‌లో రోడ్డు విస్తరణ పనుల సమయంలో కూడా చాలా పట్టుదలతో వ్యవహరించారు. ఉదయం మూడు గంటలకే రోడ్ల మీదకు వచ్చేవారు. ఆయనతో పాటు అధికారులు కూడా. ‘చార్మినార్ కింద కూర్చుని చూస్తే ఫలక్‌నుమా ప్యాలెస్ కనిపించాలి. రోడ్డు అలా తీర్చిదిద్దండి’ అనేవారు. ఒకసారి చార్మినార్ దగ్గరున్న యునాని ఆసుపత్రి పైకి వెళ్లాం. అక్కడ రోడ్డు విస్తరణ ప్రయత్నం చేస్తున్నారు. షాపులు, తోపుడు బండ్ల వాళ్లు, ఎంఐఎం కార్యకర్తలూ, నాయకులూ వచ్చేశారు. ఎన్టీయార్ డౌన్‌డౌన్ అనే నినాదాలు మొదలయ్యాయి. సార్ కిందికి వచ్చారు. మల్గీల వాళ్లని పిలవమన్నారు. వాళ్లతో ‘మీకొచ్చిన నష్టం ఏముంది? రోడ్డు వెడల్పు చేశాక మల్గీలు కట్టిస్తాం.
అవి మీకే అప్పజెప్పుతాం. మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు’ అని నచ్చజెప్పారు. అక్కడే ఉన్న అధికారులతో వాళ్ల పేర్లు నమోదు చేసుకోమన్నారు. దాంతో వెంటనే ‘ఎన్టీయార్ జిందాబాద్’లు మిన్నుముట్టాయి. నిజాం కాలేజీ రోడ్డు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. బషీర్‌బాగ్ చౌరస్తాలో ఉన్న గుడిని చూసి ‘లచ్చన్నా ఇక్కడ గుడి ఇంతకుముందు లేదు కదా. కొత్తగా వచ్చినట్లుందే’ అన్నారు. ‘అవున్సార్ ఇక్కడ నిజాం కాలేజీ వాచ్‌మెన్ రూం ఉండేది.’ అన్నాను. ‘లచ్చన్నా దీన్ని కూల్పించేయ్! నీ విగ్రహం ట్యాంక్‌బండ్ మీద పెడతా’ అన్నారు. అదే వాహనంలో ఉన్న ఆనాటి పోలీస్‌కమిషనర్ విజయరామారావు గట్టిగా నవ్వేశారు. ‘సార్ నా వల్ల కాదు’ అన్నాను మెల్లగా. రోడ్డుకు అడ్డంగా అప్పటికప్పుడు వెలసిన గుడులన్నా, మసీదులన్నా కోపంగా ఉండేది ఎన్టీయార్‌గారికి.
తప్పును ఒప్పుకునే మనిషి
ఎవరైనా తప్పు చేస్తే ఎంత సున్నితంగా మందలించే వారో, తాను తప్పు చేస్తే అంతే నిజాయితీగా ఒప్పుకునే వారు సార్. ఒకరోజు ఆబిడ్స్ ఇంట్లో ఉన్నాం. మధ్యాహ్నం రెండింటికి సెక్రటేరియట్ వెళ్దామని చెప్పారు. టైముంది కదా అని నాకు తెలిసిన వాళ్లొస్తే పక్కకు వెళ్లి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఈ లోపున సార్ కారు దగ్గరకు వచ్చేశారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను. ‘ఏంటీ ఎటువెళ్లారు’ అని అడిగారాయన కొంచెం కోపంగా. క్షణం ఆలస్యమైనా సహించరు ఆయన. క్రమశిక్షణ గల మనిషి. సార్ రెండు గంటలకు వెళ్దామన్నారు కదా. ఇపుడు ఒకటిన్నరే అయ్యింది అని వాచీ చూపించాను. దానికాయన ‘సారీ లచ్చన్న, నిద్ర పట్టలేదు. అందుకే తొందరగా బయలుదేరాను’ అన్నారు.
అప్పుడేకాదు ఆయన కుటుంబ సభ్యులుగానీ, అధికారులు, నాయకులుగానీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు అని తెలిస్తే చాలు సారీ చెప్పేవారు. ‘మీరు పెద్దవాళ్లు..’ అన్నాగానీ తప్పు తప్పే అనేవారు. ఒకసారి ఆబిడ్స్ నుంచి జూబ్లీహిల్స్ ఇంటికి వెళ్తున్నాం. తాజ్‌కృష్ణా అప్‌లోకి రాగానే.. ‘లచ్చన్నా.. బాబు పాలన ఎలా ఉందీ’ అని అడిగారు. ‘రాజకీయాల గురించి నాకేంతెల్సు సార్’ అన్నాను. ‘బయట అనుకుంటారుగా’ అన్నారు. దాంతో నేను ‘బాగానే ఉంది సార్’ అన్నాను. ‘బాబు రాజకీయ చాణుక్యుడులే’ అన్నారు. ఆ మాటల సందర్భంలోనే నేను కొంచెం చొరవ తీసుకున్నాను. ‘మన దగ్గరా తప్పులున్నాయి కదా సార్’ అంటూ ‘ఎంతో తపోశక్తి కలిగిన రావణాసురుడు సీతను చెర పట్టగానే పేరు చెడిపోయింది కదా సార్’ అన్నాను. ఆయన ‘అందరూ అన్నారు లచ్చన్నా. నీవొక్కడివే మిగిలిపోయావనుకున్నా. చివరకు నువ్వూ అనేశావు’ అనే ఒక్కమాట మాట్లాడి తల కిందికి దించేసుకున్నారు. ఇంటి వద్ద దిగే వరకు మళ్లీ ఆయన తలపైకెత్తలేదు. ఆయనలోని సంస్కారం అలాంటిది. అట్లాంటి లీడర్లని ఇప్పుడు చూస్తామా?
ఆప్యాయంగా చూసేవారు
ఆయన దగ్గర పని అంటే మా ఇంట్లో పని చేసుకున్నట్లే ఉండేది. అంతటి ఆప్యాయత చూపేవారు. ‘లచ్చన్నా భోజనం చేశారా? ఏం తెచ్చుకున్నారు? ఇంత చిన్న బాక్సు ఏం సరిపోతుందీ?’ అని పలకరించేవారు. ఆయన కార్లో ఏదైనా తింటూంటే గేర్ రాడ్ మీద ఉన్న నా చేయిని కొట్టి ‘ఊ’ అని సైగ చేసి నాకూ పెట్టేవారు. భోజన ప్రియుడు. ఉదయం నాలుగు గంటలకే ఓ కోడి, చిక్కగా మరగబెట్టిన లీటర్ పాలు, రాత్రి కిలో చేపలు, సాయంత్రం రసమలై, కోవా గర్జ్, అపుడపుడు పల్లీలు, బెల్లం… ఇట్లా మంచి బలమైన ఆహారం తీసుకునేవారు. ప్రతి ఆదివారం కొడుకులూ, కూతుళ్లూ, మనువలూ, మనవరాళ్లందరినీ పిలిచి అందరితో కలిసి భోంచేసేవారు. సార్ తిరిగి అధికారంలోకి వస్తే సత్యనారాయణస్వామి వత్రం చేస్తానని నా భార్య మొక్కుకుంది. ఆయన విజయం సాధించారు.
వ్రతం విషయం చెప్పాను. ‘నేను వస్తాను’ అన్నారు. మంచిది సార్ అన్నాను కానీ నాకు నమ్మకం లేకుండె. కానీ ఆయన నిజంగానే వచ్చారు. ఏ ఫంక్షన్లో కూడా కొద్ది నిమిషాలకు మించి ఉండని ఆయన రెండు గంటల పాటు నా ఇంట్లో ఉన్నారు. పార్సీ గుట్టలో చిన్న రెండు గదుల ఇల్లు నాది. వచ్చేముందు ఫోన్ చేసి ఏమేం వంటకాలు చేయించారని అడిగారు. ఆలు ఫ్రై, పప్పు, సాంబారు అని చెప్పాను. వచ్చి భోంచేశారు. నా పిల్లల్ని దీవించారు. నాకు బట్టలు కూడా పెట్టారు. అవి నేను కుట్టించుకోలేదు. నేను చనిపోయినప్పుడు వాటిని నా శవం మీద కప్పాలని నా కోరిక. మా నాన్న చనిపోయినపుడు కారు ఇచ్చి మరీ నన్ను ఇంటికి పంపించారు. కార్యక్రమాలన్నీ చూసుకొని రండి అని చెప్పారు. ఆ పదిరోజులే నేను ఆయన వద్ద పనిచేసిన కాలంలో డ్యూటీకి దూరంగా ఉన్నది. అలాంటి మనిషి మళ్లీ పుట్టడు.
అభిమానులంటే గౌరవం..
సార్ ఎంత బిజీగా ఉన్నా అభిమానులకూ, అవసరం రీత్యా వచ్చిన వారికి టైమ్ ఇచ్చేవారు. ఒకసారి ఆదిలాబాద్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. లంబాడీ. ఆజానుబాహుడు. ఆయన్ను చూసి ఎందుకొచ్చారని అడిగారు సార్. ‘నా కూతుర్ని చెట్టుకు కట్టేసి చెరిచారు. ఫిర్యాదు ఇస్తే పోలీసులు స్పందించడం లేద’ని చెప్తే 24 గంటలు తిరగక ముందే నిందితుల్ని అరెస్ట్ చేయించి, అక్కడి పోలీసు అధికారిని సస్పెండ్ చేయించారు. ఎక్కడైనా అన్యాయం జరిగిందని చెవినబడితే వెంటనే స్పందించేవారు. యాక్షన్ తీసుకునే వరకు మర్చిపోకుండా అధికారుల్ని ఆరా తీసేవారు.
ఆబిడ్స్ నివాసానికి సార్‌ని చూసేందుకు చాలా మంది వచ్చేవారు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని సార్‌కి తెలియనిచ్చేవారు కాదు. ప్రతిరోజు మేము ఇంట్లోంచి బయలుదేరగానే వెనుక మూడు, నాలుగు బస్సులు ఫాలో అయ్యేవి. అందరూ అభిమానులే. సార్‌ని ఒక్కక్షణమైనా చూద్దామని వాళ్ల కోరిక. నేనొకరోజు ఈ విషయాన్ని సార్‌కి చెప్పాను. ఆయన మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేసి అభిమానుల్ని కలిసారు. ఆ తర్వాత ఆబిడ్స్‌లో వాళ్లకో పెద్ద హాలు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి.. ఏవైనా ఫిర్యాదులుంటే స్వీకరించే ఏర్పాట్లు చేయించారు. ప్రతిరోజు ఒకసారి అక్కడికి వెళ్లి వాళ్లందర్నీ చూసి చేయి ఊపి వెళ్లేవారు.
అలాంటి మనిషి డల్ అయితే…
ఎప్పుడూ హుషారుగా ఉండేవారాయన. సెక్యూరిటీవాళ్లు వచ్చి డోర్ తీసేలోపు జింకపిల్లలా చటుక్కున స్వయంగా డోర్ తీసుకొని కూర్చునేవారు. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా అంతే. నేను కారు రివర్స్ తీసుకునే లోపున తిరిగి వచ్చేసేవారు. ఎంతో వేగంగా, చలాకీగా ఉండేవి ఆయన పనులు. అలాంటి వ్యక్తి చివరి రోజుల్లో చాలా డల్ అయ్యారు. చాలా నెమ్మదిగా కారు దిగేవారు. కిందికి దిగడానికి నేను సాయం పట్టాల్సిన పరిస్థితి.
– పి. శశికాంత్

బ్రిటిష్ దొరగారి గారాల భారతీయుడు

britishదేశ విభజన జరిగినప్పుడు –
వదల్లేక వదల్లేక, దూరమవుతూ, మనసు భారమవుతూ…
వలస వంతెన కూలిపోయేలా… కోట్ల టన్నుల ఉద్వేగాలు!
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు -వందల ఏళ్లనాటి దాస్యం నుండి విముక్తి పొంది…
‘వందేమాతరాన్ని’ ప్రతిధ్వనించిన దిక్కులు, చుక్కలు!
అంతేనా? ఫ్రీడమ్ ఒక్కటే ఆ వేళ అందరి ఫీలింగా?
వెళ్లిపోతున్న బ్రిటిష్‌వాళ్లకు, అంతవరకూ ‘పో… పొమ్మన్న’ ఇండియన్స్‌కి మధ్య…
ఎక్కడా చిన్న ఎమోషనైనా మిగలకుండా పోయిందా?
‘పోలేదు’ అంటున్నారు జి.పి.రెడ్డి!
‘మాతో వచ్చెయ్ కూడదా?’ అని బెంగగా అడిగిన
ఓ బ్రిటిష్ అధికారి కుటుంబంతో…ఈ ‘భారతీయుడికి’ ఉన్న పుత్రానుబంధమే ఇవాళ్టి స్పెషల్ స్టోరీ!
ఎనభైఏళ్ల కిందట రోడ్డుపై జరిగిన ఓ చిన్న సంఘటన జి.పి.రెడ్డి జీవితాన్నే మార్చేసింది. ఓ నిండు భారతీయుడిని బ్రిటన్‌కి ఆప్తుడిగా చేసింది. ‘తెల్లోలకున్న నిజాయితీ మనకాడ లేదు’ అని ఈ పెద్దాయనన్న మాటల్లో ఎంతో ఆవేదన తొణికిసలాడింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం కరీంగూడ గ్రామంలోని ఒక వ్యవసాయక్షేత్రంలో (ప్రస్తుతం మౌలాలిలో ఉంటున్నారు) మొన్నటివరకూ కాలం గడిపిన ఈ పెద్దాయన గురించి ఆసక్తికరమైన విషయాలివి…ఆరేడేళ్ల వయసులో ఉన్న ఓ నలుగురు పిల్లలు రోడ్డుపక్కన ఫుట్‌బాల్ ఆడుతున్నారు. రోడ్డుపై బ్రిటిష్ అధికారుల కార్లు వరసగా వెళుతున్నాయి. సడెన్‌గా బాల్ రోడ్డుపైకి వెళ్లింది. కార్లన్నింటికీ సడెన్‌బ్రేకులు పడ్డాయి. కార్లోంచి దిగిన తెల్లదొరలను చూడగానే పిల్లలందరూ పారిపోయారు ఒక్క జి.పి.రెడ్డి (గుండారపు పెంటారెడ్డి) తప్ప. కల్నల్ ఆఫీసర్ ఆర్‌డబ్ల్యూ బెనెట్ కారు దిగి రెడ్డిని దగ్గరికి పిలిచేలోపే… ఈ కుర్రాడు కారు దగ్గరికి వెళ్లి ‘‘దిసీజ్ మై బాల్’’ అన్నాడు. బెనెట్ కాస్త కోపంగా మొహంపెట్టి ఇంగ్లీషులో ‘‘అయితే కారు కిందకు దూరి తీసుకో’’ అన్నాడు. రెడ్డి మొహం ఎర్రగా చేసుకుని ‘‘నేను మా అమ్మానాన్నల దగ్గర తప్ప ఇంకెవరి ముందూ తలదించను. కారు ముందుకు కదలకపోతే అద్దాలు పగలగొడతాను’’ అని వార్నింగ్ ఇచ్చిన బాలుడి మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తెల్లదొరలు తెల్లమొహాలు వేశారు. బెనెట్ ఆ కుర్రాడిని ఎత్తుకుని ఓ ముద్దిచ్చి…‘‘మీ అమ్మానాన్నల దగ్గరకు తీసుకెళ్లు’’ అని అడిగాడు.

మమ్మీడాడీ…

జి.పి.రెడ్డి తండ్రి బుచ్చారెడ్డి. హైదరాబాద్‌లోని లాల్‌బజార్ ప్రాంతంలో బ్రిటిష్ దుస్తుల సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. బెనెట్ అతడిని చూస్తూనే… ‘‘ఓ… రెడ్డిసాబ్ ఈ కుర్రాడు నీ కొడుకా… చాలా హుషారుగా ఉన్నాడు’’ అనగానే… ‘‘ఏం హుషారో ఏమో సార్… ప్రతిరోజు ఏదో ఒక కంప్లయింట్’’ విసుగ్గా చెప్పాడు బుచ్చారెడ్డి. ‘‘ఒక పనిచెయ్యి, మీకు ఇంకా ముగ్గురు కొడుకులున్నారు కదా… వీడిని మాకు ఇచ్చెయ్. మా ఇంట్లో ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాను’’ అని బెనెట్ అడగ్గానే బుచ్చారెడ్డి తలూపాడు. ఇక అప్పటి నుంచి జి.పి.రెడ్డి లైఫ్‌స్టయిల్ మారిపోయింది. బెనెట్ భార్య మేరీవిల్సన్‌కి కూడా ఈ అబ్బాయి తెగ నచ్చేశాడు. ఇంకేం, రెడ్డికి అమ్మానాన్నలతో పాటు మమ్మీడాడీ కూడా వచ్చేశారు. అప్పటివరకూ చదివిన ఒకటోక్లాస్‌కి టాటా చెప్పి బెనెట్‌గారి వెంట తిరుగుతూ బతుకు పాఠాలు నేర్చుకోవడం మొదలెట్టాడు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

సొంతబిడ్డలా చూసుకునేవారు…

మా ప్రాంతంలో ఇరవైవేలమంది తెల్లోళ్లు ఉండేవాళ్లు. బెనెట్ దొర టీమ్‌లో నేనూ ఒకడినన్నమాట. తొమ్మిదేళ్ల వయసుకే… నిలబడి జీప్‌ని డ్రైవ్ చేసేవాడిని. రోజూ పొద్దున్నే రెండు గుడ్లు తిని, పాలు తాగాక పది కిలోమీటర్లు పరిగెత్తించేవారు. సాయంత్రం వాలీబాల్, హాకీ ఆడేవాడిని. బెనెట్‌సార్‌కి పిల్లలు లేరు. నన్ను సొంతబిడ్డలా చూసుకునేవారు. పనులు నేర్పించేదగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్. పదేళ్ల వయసొచ్చేసరికి బెనెట్‌సార్ జీపు డ్రైవర్ జాబ్ ఇచ్చారు. అప్పట్లో వారానికోసారి జీతం ఇచ్చేవారు. నాకు పద్నాలుగేళ్ల వయసప్పటికే యుద్ధ ట్యాంకర్ డ్రైవింగ్ శిక్షణ ఇప్పించారు బెనెట్‌సార్.

విదేశీయానం…

బెనెట్‌సార్‌తో షిప్‌లో ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, అరబ్ దేశాలన్నీ తిరిగాను. తెల్లవారి దగ్గర ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా… వారి మధ్య కాలక్షేపం మాత్రం భలే సరదాగా ఉండేది. జీతం అందగానే మా టీమ్ అందరినీ మూకీ సినిమాకి తీసుకెళ్లేవాడిని. పొద్దున్నే నాలుగింటికి స్నానం చేసి హనుమాన్ గుడిలో పూజ చేసుకునేవాడిని. బెనెట్‌సార్ నా పద్ధతులు చూసి మెచ్చుకునేవారు. ‘‘మా డిసిప్లిన్ వల్ల శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉంటుంది. మీ పద్ధతులు, ఆచారాలు మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి’ అనేవారు. ఒకరోజు మా టీమ్‌లోని జాన్సన్ అనే వ్యక్తి ‘‘నాకు తెలుగు నేర్పించవా’’ అని అడిగాడు. నేను సరదాగా ‘నీ కాల్మొక్త బాంచన్’ అని పలకమన్నాను. రెండు రోజులు నానా తంటాలు పడి ఆ పదం నేర్చుకుని, కనిపించిన ప్రతి తెలుగువాడి దగ్గర ఆ పదం పలకగానే అందరూ నవ్వేవారు. ఊహ తెలిసేనాటికే తెల్లోళ్లు నా కళ్ల ముందు ఉండేసరికి వారిపై నాకు కోపం కలిగేది కాదు. అయితే పెద్దయ్యాక మాత్రం… మన దేశంపై పెత్తనం చెయ్యడానికి వీళ్లెవరనే ఆలోచన వచ్చింది.

ఆ ఎనిమిది గంటలే…

మహాత్మాగాంధీ ఉప్పుసత్యాగ్రహం సమయం లో ఉద్యోగంలో భాగంగా బ్రిటిష్ అధికారులతో పాటు నేను కూడా వెళ్లాను. ‘వందే మాతరం’ అనే పదం తప్ప ఇంకేం వినిపించడం లేదు. జీప్ దిగకుండానే నేను కూడా రెండు చేతులూ ఎత్తి ‘వందే మాతరం’ అంటూ అరిచాను. పక్కనే కూర్చున్న ఓ బ్రిటిష్ అధికారి నా చేతులు పట్టుకుని ‘నువ్వు అరవకూడదు’ అంటూ కళ్లెర్రజేశాడు. సాయంత్రం బెనెట్‌సార్‌కి జరిగిందంతా చెప్పాను. ఆయన ‘‘డ్యూటీలో ఉన్నప్పుడు ఆ పని మాత్రమే చేయాలి’’అన్నారు. అహ్మదాబాద్ నుంచి తిరిగొచ్చేటప్పుడు ఓ పది తెల్లటోపీలు తెచ్చుకున్నాను. పొద్దున్న తొమ్మిదింటి నుంచి ఐదు గంటలవరకూ బ్రిటిషర్స్ క్యాప్ పెట్టుకుని ఐదు దాటగానే గాంధీటోపీ పెట్టుకునేవాడిని. తెల్లదొరల కళ్లుగప్పి సుభాష్‌చంద్రబోస్ ఏర్పాటుచేసే రహస్య సమావేశాలకు హాజరయ్యేవాడిని. ఆ వివరాలు తెలిసి మా టీమ్‌లోవాళ్లు నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవారు. నేను నా కోతిచేష్టలతో వారిని ఏడిపించేవాణ్ణి. గట్టిగా ఏమన్నా అంటే బెనెట్‌సార్‌తో చెబుతానని బెదిరించేవాణ్ణి.

మమ్మీడాడీకి టాటా…

1947 ఆగస్టు 15. స్వాతంత్య్రం వచ్చింది. భారతీయుల మొహాలు కోటికాంతులతో వెలిగిపోతున్నాయి. ఆ ఉత్సవాల్లో నేను కూడా చేరాను. బెనెట్‌సార్ నుంచి కబురొచ్చింది. పరుగుపరు గున వెళ్లాను. మేరీమమ్మీ నన్ను దగ్గరికి తీసుకుని ‘‘మాతో వస్తావా’’ అని అడిగింది. ‘‘ఎందుకు రాడు’’ అన్నాడు బెనెట్‌సార్ ఎంతో నమ్మకంగా. ‘‘నేను మీతో వచ్చేస్తే… మా అమ్మానా న్నలు ఏమైపోతారు’’ అన్నాను. ‘‘వాళ్లను నువ్వు చూడ్డం ఏంటి?’’ అన్నారు. ‘‘మీదగ్గర ఉద్యోగం చేసింది ఎవరి కోసం అనుకుంటున్నారు?’’ అని నేను చెప్పిన సమాధానానికి బెనెట్‌సార్ నోరు మెదపలేదు. ‘‘భారతీయుల కుటుంబ సంబంధాలు చాలా గొప్పవి. నువ్వెక్కడున్నా మా మనసు నీమీదే ఉంటుందిరా’’ అని బెనెట్‌సార్ నన్ను కౌగిలించుకున్నారు. ఆయన వెళ్తూవెళ్తూ యుద్ధట్యాంకర్ డ్రైవింగ్‌లో నాకున్న అనుభవం గురించి ఒక లెటర్ రాసి, అది చూపిస్తే భారతప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందన్నారు. వారి గుర్తుగా నా భవిష్యత్తుకి భరోసాగా రంగారెడ్డిజిల్లాలో ఐదెకరాల పొలం రాసిచ్చారు.

నా దేశం కోసం…

బెనెట్‌సార్ లెటర్ చూపిస్తే నాకెవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. చేసేది లేక నాన్నతో పాటు సేల్స్‌మన్‌గా కొన్నాళ్లు పనిచేశాను. నాకు అప్పటికే పెళ్లయి ిపిల్లలు కూడా. స్వాతంత్య్రం వచ్చిన నాలుగేళ్లకు చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తోందని మన ఆర్మీని అక్కడికి పంపారు. అప్పుడు కొందరు ఆర్మీ అధికారులు నా దగ్గరకు వచ్చి చైనా సరిహద్దుల్లో యుద్ధట్యాంకర్లను నడపడానికి రమ్మన్నారు. నా దేశాన్ని కాపాడుకునే అవకాశాన్ని వదులుకోకూడదని రోజుకూలీగా చేరాను. నాలుగు నెలలపాటు యుద్ధట్యాంకర్‌ని నడిపాను. యుద్ధం లో భాగంగా ఇద్దరు చైనా జవాన్లను సజీవంగా పట్టుకుని మన అధికారులకు అప్పగించాను. ఆ సంఘటనను గుర్తుచేస్తూ రెండేళ్లక్రితం పంజాబ్ నుంచి కొందరు అధికారులు వచ్చి అక్కడి సైనికులకు పాఠాలు చెప్పమని అడిగారు. నేను వెళ్లలేదు. తొంభైఏళ్లు దగ్గరపడుతుండగా నేనేం చెప్పగలను? ఇన్నాళ్లకు మన దేశానికి నేను గుర్తొచ్చానా… అన్న బాధ కూడా నన్ను ముందుకు పంపలేదు. చైనావార్ తర్వాత ముంబైలోని ‘సారాబాయ్ కెమికల్స్’లో ఉద్యోగ అవకాశం వచ్చి, వెంటనే చేరిపోయాను. 35 ఏళ్లు అక్కడే ఉండి పనిచేశాను.

ఆనాటి బంధం ఈనాటికీ…

నాకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అందర్నీ పెద్ద చదువులు చదివించాను. నేను ఉద్యోగం పేరుతో దూరంగా ఉండేవాడిని. నా భార్య ఉన్నంతవరకూ బిడ్డలదగ్గరే ఉండేవాడిని. ఆ తర్వాత కరీంగూడ గ్రామంలో నా కూతురు తోటలో ఉంటూ కాలక్షేపం చేశాను. ప్రస్తుతం మౌలాలిలో ఉన్న కూతురింటి దగ్గర ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాను. తెల్లదొరలిచ్చిన ఐదెకరాలు ఎప్పుడో కరిగిపోయాయి. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. పేదవాడు… కొడుకులకు కూడా బరువే. నేను మాత్రం రాజీపడలేదు. మానవహక్కుల కమిషన్‌లో కేసు వేశాను. నా పోషణ నిమిత్తం ఇంత సొమ్ము కావాలని అడిగాను. అప్పటినుంచి ప్రతినెల వాళ్లు డబ్బులు పంపుతున్నారు. మన దేశం కోసం ఆ తెల్లదొరల దగ్గర పోరాడని పాపానికి ఈ రోజు బతకడానికి బిడ్డలతో పోరాడాల్సి వస్తోందా! అనిపిస్తుంటుంది.

మన దేశం వదిలింది మొదలు ఇప్పటివరకూ బ్రిటిష్‌వారు ఏటా నాకు డబ్బులు పంపిస్తున్నారు. రెండు మూడు నెలలకొకసారి పోస్టాఫీసు దగ్గర నుంచి కబురొస్తుంది. వెళ్లి తెచ్చుకుంటాను. ఒకోసారి రెండు వేలు, ఒకోసారి మూడువేల రూపాయలుంటాయి. ప్రతినెలా ఢిల్లీలో ఉన్న చీఫ్ ఇన్ కమాండర్‌కి నేను బతికున్నట్లు లెటర్ పంపుతాను. దాన్నిబట్టి బ్రిటిష్ అధికారులు నాకు పంపిన డబ్బుని నా అడ్రస్‌కి పంపుతారు. వాళ్ల దగ్గర పట్టుమని పాతికేళ్లు కూడా పనిచేసి ఉండను. అయినా నన్ను వారి మనిషిగా భావించి, పోషిస్తున్నారు. నిజంగా వాళ్లు దొరలే… అంటూ ఆ పెద్దాయన అనర్గళంగా ఆంగ్లంలో చెబుతుంటే వినసొంపుగా అనిపించింది.

– భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి;
ఫొటోలు: గడిగె బాలస్వామి

**********

ఆదివారం వచ్చిందంటే మటన్ స్పెషల్ ఉండాలి వాళ్లకి. అయితే మేకనైనా, కోడినైనా కోసేముందు పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించి, ఆరోగ్యంగా ఉందంటేనే కోయించేవారు.

పొద్దున్న తొమ్మిదింటికి విధులకు హాజరయ్యేటప్పుడు షర్టు చేతులు మోచేతి వరకూ మడిచి, సాయంత్రం ఐదింటికి డ్యూటీ అయిపోయాక మడత విప్పేసి ఫుల్‌హ్యాండ్స్ బటన్ పెట్టేస్తారు. వారి మధ్యన పెరిగినవాడిని కదా! ఇప్పటికీ నాకు ఆ అలవాటు పోలేదు.
– జి.పి.రెడ్డి

మంచి చేసే వాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు..

koteswrmma
ప్రజాయుద్ధంలో ఆరితేరిన ‘నిర్జన వారధి’ కొండపల్లి కోటేశ్వరమ్మ. ఆవిడ పోరాటం బాల్యం నుంచే మొదలైంది. కొండపల్లి సీతారామయ్య సహచరిణిగా కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వామురాలై.. ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా చలించక ఎంచుకున్న మార్గంలోనే నడిచిన ధీర మహిళ ఆమె. నూరేళ్ల జీవితానికి అయిదు అడుగుల దూరంలో ఉన్న కోటేశ్వరమ్మ.. తన జీవన ఆరోగ్య సూత్రాలను ఇలా చెప్పుకొచ్చారు..
‘ఇతరులకు అపకారం చేయని వారు, సమాజానికి మేలు చేసే వారు ఎక్కువ కాలం బతుకుతారు..’ అని నాతో ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య చెప్పారు. ఈ వాక్యాలు నా విషయంలో నిజమేమో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే నేను ముందుకు నడిచాను. ఇంత కాలం ఆరోగ్యంగా బతకడానికి బహుశా అదే కారణం అయ్యుంటుంది. పరుల కోసం పాటు పడాలన్న తపన మరికొంత కాలం జీవించేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. చాలా మంది మాదిరిగానే నా జీవితంలోను అనేక కష్టాలు ఎదురయ్యాయి. నా కుమారుడు చందును పోలీసులు మాయం చేసినప్పుడు, నా కుమార్తె కరుణ మానసిక వేదన భరించలేక మరణించినప్పుడు- ఇంకా ఇలా రకరకాల కష్టాలు వెంటాడుతున్నప్పుడు- అనేక మంది మిత్రులు నాకు తోడుగా నిలిచారు. అలాంటప్పుడు- కార్యశూరులు, త్యాగధనులనిపించుకున్న మహనీయుల స్ఫూర్తితో మనిషి ఉత్తేజితుడవుతాడేమో.. వారి ఓదార్పు ఊపిరులూదుతుందేమో అనిపిస్తుంది. ఆ కారణంతోనే నేను ఇన్నాళ్లు జీవించానేమోనని కూడా అనిపిస్తుంది. కొందరు వృద్ధాప్యం నరకంలాంటిదంటారు. రకరకాల సమస్యలతో బాధపడుతూ నిరాశతో నిత్యం బతుకుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి కన్నా- మంచి పనిచేశాననుకుంటూ, మనిషిలా బ్రతికాననుకుంటూ మనశ్శాంతితో కన్నుమూయటం మంచిదేమో అనిపిస్తుంది. ఇలా బతకాలంటే మానసికంగా ధృడంగా ఉండాలి. మానసికంగా బలంగా ఉంటే సమయానికి తిండిలేకపోయినా, నిద్ర లేకపోయినా అనారోగ్యం దరిచేరదు.
మానసిక స్థయిర్యమే ప్రధానం..
సంస్కరణోద్యమం కారణంగా వీరేశలింగం ప్రభావం మా కుటుంబంపై తీవ్రంగా ఉండేది. అందుకే బాలవితంతువైౖన నాకు కొండపల్లి సీతారామయ్యతో వివాహం జరిగింది. ఆయన స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నా. సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో చురుకైన పాత్ర వహించేదాన్ని. ఉద్యమాలంటే తెలిసిందే కదా! సమయానికి తిండి దొరకదు. నిద్ర ఉండదు. ఇక యూజీ (అండర్‌ గ్రౌండ్‌)లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వైపు ఉద్యమాలలో పాల్గొనేటప్పుడు కలిగే ఒత్తిడి ఒక ఎత్తు అయితే- వ్యక్తిగత జీవితంలో నాకు ఎదురయిన సవాళ్లు మరో ఎత్తు. అలాంటి సమయంలో కూడా నాకు ఎదురయిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నానంటే- నా మానసిక సైర్థ్యమే ప్రధాన కారణం.
నలభై ఏళ్లు హాస్టల్‌లోనే..
ఉద్యమాల సమయంలో తిండి, నిద్ర ఉండేది కాదని చెప్పాను కదా. ఆ తర్వాత ఎక్కువ కాలం హాస్టల్‌లో ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే హాస్టల్‌ అంటే క్రమశిక్షణ. సమయానికి తిండి ఉండేది. నిద్ర ఉండేది. దీనితో తిండి విషయంలో క్రమశిక్షణ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ! చిన్నప్పటి నుంచి నేను శాకాహారిని. ఏ రోజూ ఆహార నియమాలను పాటించలేదు. ఇది తినకూడదు, అది తినకూడదు అన్న నిబంధనలేవీ లేవు నాకు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మితాహారిగా మారాను. అవసరం మేరకే తింటున్నాను. ఏదైనా నచ్చింది కదాని మితిమీరి తినే అలవాటు లేదు. రాత్రి పడుకునే ముందు మాత్రం పుస్తకాలు చదువుతాను. దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది. వీటన్నిటికీ తోడు.. నన్ను అభిమానించేవాళ్లను ఎంతో మందిని సంపాదించుకోగలిగాను. ప్రేమించేవారిని పొందగలిగాను. వారి ఆత్మీయానురాగాలే నాకు కొండంత బలం అనిపిస్తుందిప్పుడు. ఆ బలం ముందు నేను పడిన కష్టాలు చిన్నవైపోయాయి. ఎంచుకున్న మార్గంలో రాజీపడకుండా నడిచి.. సంఘసేవలో తరించానన్న సంతృప్తితోనే నేటికీ ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను.
బాధాకరమైన సంఘటనలు, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. ఎందుకంటే అసలే ఆ సమయంలో ఎవరైనా బలహీనంగా ఉంటారు. దానికి తోడు మరింత కుంగిపోతే మరీ బలహీనపడతారు. ఆ వెనకే అనారోగ్యం చుట్టుముడుతుంది.
జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఉన్నంత కాలం సంతృప్తిగా బతకడమే తెలుసు. ఆ సంతృప్తే జీవాయుష్షును పెంచుతుంది అన్నది నా అభిప్రాయం.
మంచి పని చేశాననుకుంటూ, మనిషిలా బతికాననుకుంటూ.. మనశ్శాంతితో కన్ను మూయడం మంచిది అనిపిస్తుంది..
నా జీవిత చరిత్ర ‘నిర్జన వారధి’కి సంబంధించిన రాయల్టీని రెండు సంస్థలకు విరాళంగా ఇచ్చాను. ఇటువంటి పనులు సంతృప్తిని ఇస్తూ ఉంటాయి.
ఉద్యమ నేపథ్యం..
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాల్య వితంతువును. ఆ రోజుల్లో నేను చదివింది కేవలం ఎనిమిదో తరగతే! పాటలు బాగా పాడేదాన్ని. దీంతో అందరూ నన్ను ‘నైటింగేల్‌.. నైటింగేల్‌’ అంటూ ఏడిపించేవారు. ఆ బాధ పడలేక చదువు మానేశాను. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. జాతీయోద్యమంలో పాల్గొనడం బాధ్యతగా భావించేవారు. ఆ విధంగా నాలుగు ఉద్యమాల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి అదే నా జీవనమార్గం అయ్యింది. సీతారామయ్యగారితో వివాహం అయిన తర్వాత సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నాను. మా సంస్థలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించినప్పుడు.. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాం. ఈ ఉద్యమ సమయంలోనే నా భర్త దూరమయ్యాడు. నా బంగారమంతా పార్టీకి ఇచ్చేశాను. ఇద్దరు పిల్లలను పోషించలేని దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నా. పిల్లలు నాకు దూరంగా ఉన్న సమయంలో- వాళ్లకు కథలు చెబుతున్నట్లు ఊహించుకుంటూ- ‘అమ్మ చెప్పిన కథలు’ రాశాను. ఆ తర్వాత కూడా అనేక రచనలు చేశాను. వాటికి లభించిన ప్రశంసలు నా ఆయుష్షును మరింత పెంచాయనిపిస్తుంది! ఇప్పుడు పుస్తకం నాకు తోడు.. నాకున్న గొప్ప నేస్తం. అందుకే వైజాగ్‌లో జరుగుతున్న పుస్తకప్రదర్శనకు కూడా వెళ్లా.. ఆ పుస్తకాలను చూస్తుంటే కొత్త శక్తి వచ్చినట్లనిపించింది.
వాసు, విశాఖపట్టణం
ఫోటోలు : విజయ్‌

విధ్వంసంలో మనిషి మనుగడెక్కడ?-కాకర్ల సుబ్బారావు.

డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా, నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్‌గా కొన్ని ద శాబ్దాల పాటు రాష్ట్రానికి, ఎంతో మంది రోగులకు సేవలందించిన వ్యక్తి కాకర్ల సుబ్బారావు. దేశవిదేశాల్లో ఎన్నో గురుతర బాధ్యతల్ని నిర్వహించిన ఆయన 88 ఏళ్ల వయసులోనూ ఓ విద్యాసంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సుదీర్ఘజీవన ప్రస్థానంలో ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’.

kakarla

‘ఒక రకం సిద్ధాంతాన్ని ఎంచుకుని, అందుకు విరుద్ధంగా అడుగులు వేయడంలో కలిగే బాధేమిటో అనుభవించిన వారికే తెలుస్తుంది. కృష్ణాజిల్లాలోని పెద్ద ముత్తేవి నా జన్మస్థలం. నా ప్రాథమిక విద్యాభ్యాసం చల్లపల్లి రాజా వారి హైస్కూల్లో జరిగింది. సాయంత్రం వేళ స్కూలు హాస్టల్‌లోనే చండ్ర రాజేశ్వరరావు, మరికొంత మంది పెద్దలు అక్కడి విద్యార్ధులందరికీ కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి, మార్క్సిజం గురించి చెబుతుండే వారు. పక్కా గాంధేయవాది అయిన నా మిత్రుడి ప్రభావమో ఏమో నా మనసు మాత్రం గాంధేయవాదం వైపే మొగ్గు చూపేది. 1940లో.. గాంధీ గారి పిలుపుతో మనం కూడా సత్యాగ్రహం చేద్దామని నా మిత్రుడన్నాడు. నా చదువు, పురోగతి మీద నా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే సామాజిక కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం నాకు ఇష్టముండేది కాదు. కాకపోతే గాంధేయవాదం మీద అభిమానంతో మేము చిన్నచిన్న నాటకాల్లో పాలుపంచుకునే వాళ్లం. అది కూడా చల్లపల్లి రాజా అయిన యార్లగడ్డ శివరామ ప్రసాద్ రాజు గారికి నచ్చేది కాదు. ఒక రోజు ఆయన మేనేజర్ మమ్మల్ని పిలిచి ‘బాబూ ఇలాగైతే చాలా కష్టం. ఇక ముందెప్పుడూ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే మంచిది’ అన్నాడు. ఆ తరువాత మేమింక మౌనంగా ఉండిపోయాం.

హింసతో ఏం చేద్దామని..

కాలేజీకి వచ్చాక.. 1941-42లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యింది. మేమూ అనుసరించాం. గాంధీ ఉపవాసదీక్ష చేస్తే మేమూ చేసేవాళ్లం. మమ్మల్ని ఏ అంశం ప్రభావితం చేసిందో ఏమో కానీ గాంధీ గారి సిద్ధాంతానికి విరుద్ధంగా ఒకరోజు విద్యార్థులమంతా కలిసి చల్లపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లి పట్టాల్ని తొలగించేందుకు సిద్ధమయ్యాం. పని ప్రారంభించగానే పోలీసులు వచ్చారు. ఏం జరుగుతుందోనని మాలో ఒకటే ఉత్కంఠ. ఉన్నట్టుండి మాలో కొందరు వాళ్ల మీదికి రాళ్లు విసిరారు. ఓ రాయి పోలీస్ కానిస్టేబుల్ నుదుటికి తాకింది. రక్తంతో దుస్తులు తడిచిపోయాయి. ఊహించని పరిణామంతో నిశ్చేష్టుడినయ్యాను. ఇలాంటి హింసాత్మక కార్యాల్లో నేనెందుకు పాల్గొనాలి? అని నాలో నేనే మధనపడ్డాను. వెంటనే అక్కడి నుంచి తప్పుకుని వచ్చేశాను. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. నేను భయపడి పారిపోయానని అందరూ తిట్టుకున్నారు. నేను అవేమీ పట్టించుకోలేదు. హింస ఏ వైపున జరిగినా తప్పే కదా! గాంధీగారి అహింసా సూత్రాన్ని నేను ఇప్పుడూ అంతే బలంగా నమ్ముతాను.

పేషెంట్‌దే పెద్దమాట

అమెరికాలో చదువుకోవాలనే కోరిక నాలో బలంగా ఉండేది. వైజాగ్‌లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ కోసం అమెరికా వెళ్లాను. పేషంట్ చెప్పే విషయాల్ని వినేందుకు ఇక్కడ మన డాక్టర్లు విసుగుపడతారు. కానీ అమెరికాలో పరిస్థితి వేరు. డాక్టర్, పేషంట్ల మధ్య పరస్పర గౌరవభావం ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదే కావడం వల్లనో ఏమో.. పేషంట్ల మాటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే వారి ఆలోచనా విధానం నాకు బాగా నచ్చేది. డాక్టర్ అన్ని వ్యా«ధుల మీదా కొంతే మనసు పెడతాడు. కానీ పేషంట్ తనకున్న ఒక్క వ్యాధి గురించి ఎంతో లోతుగా తెలుసుకుంటాడు.

ఇప్పుడు ఇంటర్‌నెట్ వల్ల మరింతగా తెలుసుకోగలుగుతున్నాడు. డాక్టర్ కన్నా బాగా విద్యావంతుడైన రోగి బెటర్ అని అంటాన్నేను. ఓ రోజు ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన భార్యను ఒక న్యూరాలజిస్టు వద్దకు తీసుకువచ్చాడు. ‘నా భార్యకు వచ్చిన వ్యాధి ఏంటి? దానికి కారణమేంటి?’ అంటూ అతనేదో అడిగితే, ‘ఆ జబ్బు గురించి మీకు అర్థం కావాలంటే ఐదేళ్లు పడుతుంది’.. అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఆ డాక్టరు. విదేశాల్లో ఎప్పుడూ అలా మాట్లాడరు. వివరించి చెప్పేంత సమయం లేకపోతే దానికి సంబంధించిన పత్రికలో, పుస్తకాలో సూచిస్తారు. కానీ ఇలా దాటవేసే ప్రయత్నం చేయరు. ఈ విషయంలో నేను విదేశీయుల నుంచి చాలా నేర్చుకున్నాను.

అప్పటికి అదే మేలు

కొందరు పేషంట్లు వేసే ప్రశ్నలు వింతగా ఉండేవి. నేను రేడియాలజిస్టును కదా. 1960లో.. ఎక్స్‌రే ప్రాక్టీస్ చేస్తున్నాను. గర్భిణులకు ఎక్స్-రే తీసే సందర్భంలో మాకు ఎప్పుడూ ఓ ప్రశ్న ఎదురయ్యేది. పుట్టేది ఆడపిల్లా? మగపిల్లాడా? అని గుచ్చిగుచ్చి అడిగేవారు. మాకు తెలియదని చెప్పినా, మౌనంగా ఉన్నా.. ‘పుట్టబోయేది ఆడపిల్లే కావచ్చు.. అందుకే డాక్టర్ ఏమీ చెప్పడం లేదు’ అనే అభిప్రాయానికి వచ్చేవారు. ఆ రోజు నుంచే ఆమె ఆహార పానీయాల విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉండేవారు.

దీంతో ఎవరైనా అడిగితే తడుముకోకుండా మగపిల్లాడే అని చెప్పేవాడ్ని. అప్పట్నుంచి ఆమె కుటుంబసభ్యులంతా ఆమె ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించేవారు. నేను చెప్పినదానికి విరుద్ధంగా ఆడశిశువు పుడితే నన్నెవరూ నిలదీయలేదు కానీ, మగబిడ్డ పుట్టినవాళ్లు మాత్రం.. మీరు చెప్పినట్టే జరిగిందని నాకు స్వీట్ పాకెట్లు ఇచ్చేవాళ్లు. వాళ్ల మాటలు విని నవ్వుకునే వాడిని. అలా చెప్పడం ఇప్పుడు చట్ట విరుద్ధమే కానీ, ఆ రోజుల్లో ఆ మాటే ఎంతో మేలు చేసేది. ‘పడగొట్టే సత్యం కన్నా నిలబెట్టే అబద్దమే గొప్పది’.. అనే శ్రీకృష్ణుడి మాటలు నాకు పదేపదే గుర్తుకొచ్చేవి.

నియంత్రణ లోపిస్తే నిలకడేది?

హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో మా మామయ్య వాళ్లుండే వాళ్లు. అక్కడ వారికి 18 ఎకరాల భూమి ఉండేది. అందులో రాళ్లే ఎక్కువ. ఎలాగోలా చదును చేసి ద్రాక్షతోట వేసే వాళ్లం. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఆబిడ్స్‌లో క్లినిక్ కూడా ఉండేది. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఓ రోజు రాత్రి ఆ తోటంతా నరికివేశారు. తరువాత కొద్ది రోజులకే మా ఇంటికి నిప్పంటించారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. మనసు చెదిరిపోయింది. ఇక ఇక్కడ ఉండాలనిపించలేదు. ప్రొఫెసర్‌గా ఉద్యోగం చూసుకుని 1970లో అమెరికా వె ళ్లిపోయాను.

రెండేళ్లు గడిచాక తిరిగి వచ్చేద్దామనుకునే సరికి ‘జై ఆంధ్ర’ ఉద్యమం మొదలయ్యింది. దీంతో 1985 వరకు.. అంటే ఎన్‌టీఆర్ రమ్మని పిలిచేదాకా అక్కడే ఉండిపోయాను. ఉద్యమాలకు నేను వ్యతిరేకం కాదు. అన్యాయం జరిగితే, జరిగిందనిపిస్తే ఉద్యమాలు రావచ్చు. కానీ, అవి విధ్వంసకరంగా, హింసాత్మకంగా మారొద్దన్నది నా అభిప్రాయం. ఆలోచనాపరులెవరూ అలాంటి చర్యలకు పాల్పడకపోవచ్చు. ఉద్యమ నాయకులూ అందుకు ప్రోత్సహించకపోవచ్చు. కానీ, అలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా నియంత్రించే బాధ్యత మేధావులది, ఉద్యమ నాయకులది కూడా. హింస, విధ్వంసాలు జరిగిన చోట మానవ సంబంధాలకు మనుగడ ఉండదని నా అనుభవంలో తెలిసొచ్చింది.

చిన్నవే అనుకుంటే చితికిపోతాం..

అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో ఓసారి బస్సెక్కాను. బస్సులో ఉండే మెషీన్‌లో మూడు నాణాలు వేస్తే టికెట్ వస్తుంది. తీరా చూస్తే నా వద్ద రెండు నాణాలే ఉన్నాయి. డాలర్స్ ఉన్నాయి కానీ, నాణాలే వేయాలి. అత్యవసరంగా వెళ్లాలి. అప్పటికే ఆలస్యమయింది. మరో నాణెం దొరక్కపోతుందా అని జేబులన్నీ తడిమి చూశాను. లేదు. ఇక లాభం లేదనుకుని, నన్ను నేనే తిట్టుకుని బస్సు దిగేందుకు ఓ అడుగు వేశాను. ఎప్పటినుంచి గమనిస్తున్నాడో ఓ 14 ఏళ్ల బ్లాక్ కుర్రాడు ఓ నాణెం తీసి ఇచ్చాడు. చిరునవ్వుతో నన్నే చూస్తున్న ఆ పిల్లాడిని సంభ్రమాశ్చర్యాలతో చూశాను. నాణెం తీసుకుని డాలర్ ఇవ్వబోతే వద్దని తలూపాడు. వాళ్ల భాష రాకపోవడం వల్ల కృతజ్ఞతగా కరచాలనం చేశాను.

జీవితంలో ప్రతి విషయం పట్లా ఎంతో జాగ్రత్తగా ఉంటామనుకుంటూనే ఎలాంటి పొరపాట్లు చేస్తామో నాకు ఆ రోజు స్పష్టంగా బోధపడింది. జీవన గమనాన్ని ఆపడానికి పెద్ద తప్పులే చేయనవసరం లేదు. చాలా చిన్నతప్పు వల్ల కూడా ఒక్కోసారి జీవితం స్తంభించిపోతుందని ఆ రోజు స్పష్టమయింది. ఆ సత్యమే నన్ను మరింత జాగ్రత్తగా ఉండేలా మార్చింది.

బమ్మెర