కేక్ కట్ చేస్తారు…హార్ట్ టచ్ చేస్తారు

జీవితం ఒక తియ్యని వేడుక.
అందరికీనా?
అవును. పిల్లల మధ్య గడిపేవారందరికీ!
పిల్లల్లో కలిసిపోతే…
పెద్దవాళ్లక్కూడా ఆడిపాడాలనిపిస్తుంది.
స్ఫూర్తి హోమ్ పిల్లలతో కలిస్తే మాత్రం…
ఆటపాటలతో పాటుబర్త్‌డే కూడా జరుపుకోవాలనిపిస్తుంది.
అంత తియ్యగా సెలబ్రేట్ చేస్తారు వారు!
సంతోషాన్ని పంచాలని వచ్చే విజిటర్స్…
చివరికి పిల్లలు పంచిన సంతోషాన్ని తమ గుండెల్లో నింపుకుని వెళతారంటే చూడండి…
అరేంజ్‌మెంట్స్ ఎలా ఉంటాయో!
ఆ అనాథ పిల్లలు జరిపే ఆత్మీయ వేడుకలే ఈవారం ‘ప్రజాంశం’.

అనాథపిల్లలు, అనాథ వృద్ధుల సమక్షంలో ఆనందంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన సంగతేమీ కాదు. ఎందుకంటే అనాథాశ్రమాల్లో మనం పుట్టినరోజు చేసుకుంటున్నామంటే… ఆ పిల్లలు మనబోటి అతిథులు తెచ్చే చాక్లెట్ల కోసం ఎదురుచూస్తారని, కొత్తబట్టిలిస్తే ఆనందపడతారని అనుకుంటాం. అయితే ‘స్ఫూర్తి ఆర్ఫన్ హోమ్’ లోని పిల్లలు మాత్రం వచ్చిన అతిథిని ఎలా సంతోషపరచాలా అని ఆలోచిస్తారు. అతిథి పుట్టినరోజు వచ్చిందంటే చాలు వారి ఆశ్రమాన్ని అందంగా అలంకరించేస్తారు. ఇటువంటి ఆర్ఫన్‌హోమ్స్ గురించి చాలామందికి తెలియదు. ‘స్ఫూర్తి’ ఫౌండేషన్ హోమ్‌లో జరిగే అతిథుల పుట్టినరోజు వేడుకల వెనక ఉన్న ఉత్సాహం గురించి ఉల్లాసంగా చెప్పేదే ఈ కథనం…

spurthi1

సినిమారంగం, రాజకీయరంగం, ఐటి ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు… చాలామందికి ‘స్ఫూర్తి’ ఆశ్రమంలోని పిల్లల సన్నిధి నచ్చుతుంది. ఓ గంట కాలక్షేపం చేసి వెళ్లిపోదాం అనుకుని వచ్చినవారు అక్కడ నుంచి వెంటనే కదలలేకపోతారు. లంచ్ టైమ్‌కి వచ్చినవాళ్లు డిన్నర్ కూడా చేసి వెళతారు. ఆ పిల్లల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే… ‘సెలబ్రేషన్’ అంటారు ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీవ్యాల్. ‘‘మా హోమ్‌లో పుట్టినరోజు జరుపుకునేవారు ముందుగానే ఫోన్ చేస్తారు. దాంతో మా పిల్లలు ఆ రోజు సాయంత్రానికల్లా హోమ్‌ని అందంగా అలంకరించేస్తారు.

క్యాండిల్ దగ్గర నుంచి వెల్‌కమ్ బెలూన్ల వరకూ అన్నీ సిద్ధం చేస్తారు. ఒకవేళ వచ్చేది పెద్ద సెలబ్రెటీ అయితే, వెల్‌కమ్ బ్యానర్లు కూడా సిద్ధం చేస్తారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి నా ప్రమేయం ఏమీ ఉండదు. అంతా మా పిల్లలే చూసుకుంటారు. పాటలు, డ్యాన్సులు… అన్ని ఏర్పాట్లూ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. పుట్టినరోజు జరుపుకునేవారు చిన్న పిల్లలైతే… బెలూన్లు, బొమ్మలతో అలంకరిస్తారు. అదే పెద్దవాళ్లయితే రంగురంగుల పూలు, మంచిమంచి వాక్యాలతో అలంకరిస్తారు. ఇవీన్న చూసి వచ్చిన అతిథులు ఆనందిస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్.

స్కూలు ఆలోచన…

అమెరికాలో ఎమ్‌ఏ చదువుకున్న శ్రీవ్యాల్‌కి అనాథాశ్రమం స్థాపించాలన్న ఆలోచన రావడం వెనుక ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. చదువు పూర్తయ్యాక పేదపిల్లల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాలను స్థాపిద్దామనుకున్నాను. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాక కొంతకాలం ఉద్యోగం చేశాను. ‘అన్నమో రామచంద్రా!’ అంటూ అన్నం కోసం అల్లాడే అనాథపిల్లలు కొందరు కంటపడడంతో, పాఠశాల కంటె ముందు, అనాథాశ్రమం స్థాపించాలనుకున్నాను. 2006లో హైదరాబాద్ చర్లపల్లి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ‘స్ఫూర్తి’ పేరుతో ఆశ్రమం ప్రారంభించాను. ముగ్గురు పిల్లలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు 192 మంది అనాథ పిల్లలున్నారు.

మొదట్లో నా ఆలోచనకు కేవలం నలుగురు స్నేహితులు మాత్రమే అండగా నిలబడ్డారు. రోజులు గడిచేకొద్దీ నన్ను అర్థం చేసుకునేవారి సంఖ్య పెరిగింది. కొందరు ఎన్నారై మిత్రులతోబాటు ఇక్కడిస్నేహితులు, బంధువులు, ప్రైవేటు స్కూలు టీచర్లు… ఇలా దాతల సర్కిల్ పెంచుకున్నాను. మా హోమ్‌లో పిల్లల్ని చేర్పించడానికి… పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పరిచయస్థులు ఫోన్లు చేస్తూనే ఉంటారు’’ అన్నారు శ్రీవ్యాల్. ఆయన చెప్పే మాటలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి ఆ హోమ్ గోడలపై ఉన్న పెయింటింగ్స్. ఈ ఏడాది జూన్‌లో ఈ హోమ్ పిల్లలు వేసిన పెయింటింగ్స్‌ని బంజారాహిల్స్‌లోని ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రం ఫొటో ఎగ్జిబిషన్ గా ప్రదర్శించింది.

ఫస్ట్ బర్త్‌డే ప్రత్యేకత

 ‘‘మా హోమ్‌లో వారానికొక గెస్ట్ పుట్టినరోజు తప్పనిసరిగా ఉంటుంది. తమ చిన్నారుల మొదటిపుట్టినరోజు మాతో కలసి చేసుకోవాలనుకునేవారు నెలకు, రెండు నెలలకు ఒకసారి వస్తుంటారు. ఫస్ట్ బర్త్‌డే అనగానే మా పిల్లలకు ఎక్కడిలేని సంతోషం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చే అతిథులు మా పిల్లలకు కొత్తబట్టలు తేవడం, మధ్యాహ్నం స్పెషల్ భోజనం… చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇవ్వడం వంటి ప్రత్యేకతలుంటాయి. ఇక సెలబ్రిటీలైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు తమతో గడపడమే పెద్ద బహుమతిగా భావిస్తారు మావాళ్లు. వీరు గాక కాలేజీ పిల్లలు, ఐటి ఉద్యోగులు కూడా వచ్చి, దాదాపు వీకెండ్స్ అంతా ఇక్కడే గడుపుతారు. ఈ పిల్లలతో క్యారమ్స్, ఫుట్‌బాల్, క్రికెట్… వంటి ఆటలు ఆడుతూ టైమ్‌పాస్ చేస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్.

తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కున చేర్చుకోవడం బాగానే ఉంటుంది. కాని వారు ఆశ్రమంలో ఉన్నంతకాలం వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ఆనందంగా ఉంచడం చాలా కష్టం. ఆ కష్టాన్ని శ్రీవ్యాల్ అధిగమించారనే చెప్పాలి. పిల్లల్ని చదివించడంతో పాటు, ఆడిస్తుంటారు. అప్పుడప్పుడు జూపార్క్‌కి, సినిమాలకు, పార్కులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు తీసుకెళ్తారు. మరి అంతమందిని బయటికి తీసుకెళ్లడమంటే మాటలు కాదు. అందుకే తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సాయం చేస్తామని ముందుకొచ్చినవారితో ‘‘మా పిల్లలు ఫలానా ప్రోగ్రామ్ చూడాలంటున్నారు’ అని మాత్రం చెబుతారు. ఇష్టమైనవారు దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. లేదంటే నేనే చేసుకుంటాను’’ అంటారు శ్రీవ్యాల్.

అనాథ పిల్లలను సొంత పిల్లల్లా అక్కున చేర్చుకుని నిరంతరం వారిని ఉత్సాహంగా ఉంచుతున్న శ్రీవ్యాల్ సేవలు అభినందనీయం.

– భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు దాతల దొడ్డమనసు
 ‘‘ప్రస్తుతం మా హోమ్ పిల్లలంతా ప్రైవేటు స్కూల్స్‌లో చదువుకుంటున్నారు. వీరి కోసం భవిష్యత్తులో సొంతంగా స్కూలు నిర్మించాలనుకుంటున్నాను. మా హోమ్‌లో పిల్లలకే కాకుండా బయట పాఠశాలల్లోని 30మంది పేద విద్యార్థులకు స్కూలు ఫీజు చెల్లిస్తున్నాను. ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు. దాతల దొడ్డమనసు. స్ఫూర్తి పిల్లలు పదిమందికి స్ఫూర్తిగా ఎదగాలని కోరుకునేవారి కోరిక ఫలితమే మా పిల్లల కళ్లలోని వెలుగుల రహస్యం’’
– శ్రీవ్యాల్

కలెక్టర్లకే పాఠాలు చెప్పిన రైతు..లలితమ్మ

lalithamma

హైదరాబాద్ జిల్లా :

రసాయన ఎరువుల్లో ఉపయోగించే నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటివాటికి  ఆవర్తన పట్టికలో ఉండే స్థానాలూ ధర్మాలూ మర్మాలూ ఏమీ తెలియదు ఆ అమ్మకు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే…చేలల్లో చాళ్లలో వేళ్లు పారాడిస్తూ పంట నిండుగా పండాలంటే నేలకు సారం ఉండాలని! అందుకు రసాయనాల కంటే పేడ, పుట్టమట్టిలాంటివే గట్టివని! ఆ అనుభవంతో సేంద్రియ ఎరువనే పరుసవేదిని  ఆకాశం స్లాబ్ కింద నేలతల్లి ఫ్లోరింగ్‌లోని నాలుగెకరాల చేను ల్యాబ్‌లో కనుక్కుందామె.

ఆ పరుసవేదిని పంటకు ఆనించి బంగారం పండించితన చెలకలో ఆమె సృష్టించిన కలకలం ఢిల్లీలోని ‘కలెక్టర్ల కాలేజీ’ చెవులనూ తాకింది. అంతే… నేల మోటారునే అబ్బురంగా చూసే ఆమె గాలిమోటారుని నిబ్బరంగా ఎక్కి వచ్చింది. కాబోయే ‘జిల్లా దొరలకు’ పాఠాలు చెప్పడానికి ఢిల్లీ దాకా వెళ్లొచ్చిన లలితమ్మ స్ఫూర్తిదాయక కథనమే నేటి ప్రజాంశం.

 పదేళ్ల కిత్రం లలితమ్మ రోజుకూలి. పొద్దునే కొడవలి పట్టుకుని పొలానికి వెళితేగాని పొట్టగడిచేది కాదు. సొంతంగా పొలం ఉన్నా…పెట్టుబడి పెట్టి పండించే స్తోమతలేక లలితమ్మ, ఆమె భర్త వ్యవసాయ పనులు చేసుకుని బతుకు బండినీడ్చారు. నాటి రోజుకూలి లలితమ్మే ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్లకు పాఠాలు చెప్పింది. మూడు నెలల క్రితం ఢిల్లీలోని లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వేదికగా లలితమ్మ పాఠాలు విన్న ట్రైనీ ఐఏఎస్‌లు హాలు దద్దరిల్లేలా చప్పట్లు కొట్టారు.

‘పుస్తకాల్లో అక్షరాలు కాదు…లలితమ్మలాంటి సాక్ష్యాలు’ కావాలంటూ శిక్షణలో ఉన్న కలెక్టర్లు సభాముఖంగా తెలియజేశారు. అవును, అధిక దిగుబడిని వచ్చే వ్యవసాయ పద్ధతుల్ని ల్యాబ్‌లో కాదు లైవ్‌గానే చేసి చూపించాలి. లలితమ్మ అదే చేసింది. సుస్థిర వ్యవసాయం పేరుతో అంతరించిపోతున్న పాత పంటల్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించి అధిక లాభాలు గడిస్తున్న లలితమ్మ తోటి రైతులందరికీ ఆదర్శంగా నిలబడడం వెనకున్న విశేషాలే ఈ వారం ప్రజాంశం.

 ‘‘హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మీదిమోటార్ల (విమానం) తీస్కపోయిండ్రు. అక్కడ మసూర్కి పోవాలన్నరు. చూస్తే ఏప్రిల్ నెల…ఈడ ఎండలు మండుతుంటే… ఆడ మస్తు చలి. సెట్టర్లు కట్టుకుని పోయినం. గదేదో… చదువుకునే కాలేజి లెక్కుంది. పెద్ద హాలునిండ నల్లసూట్లు ఏసుకుని మస్తు జనమున్నరు. ఈడికెల్లి నాతోని ఇంకో నలుగురు ఆడోళ్లు వచ్చిండ్రు. లోపలికి పోంగనే రాండ్రి అనుకుంటూ మా చేతులు వట్టుకుని తీస్కపోయిండ్రు. ముందుగాల మమ్మల్ని తీస్కపోయిన రాయుడుసారు ఇంగ్లీష్‌ల మాట్లాడిండు. ఆ తర్వాత నన్ను మాట్లాడమన్నరు.

నేను తెలుగుల చెబుతుంటే…గతే ముచ్చట ఆ సారు ఇంగ్లీష్‌ల చెప్పిండు’’ అని ఎంతో ఆనందంగా చెప్పింది లలితమ్మ. మెదక్‌జిల్లా జహిరాబాద్ మండలం రాయ్‌పల్లి గ్రామానికి చెందిన లలితమ్మ తన జీవితంలో మోటర్‌సైకిల్ కూడా ఎక్కుతాననుకోలేదు, ఏకంగా విమానంలో వెళ్లి ట్రైనీ ఐఏఎస్‌లకు క్లాస్‌లిచ్చింది.

సుస్థిర వ్యవసాయం

 ‘‘గిప్పుడు తినే తిండిల బలంలేదు అంటున్నరు. అయినా తింటున్నరు. ఏం జేస్తరు. మందులేసి మందుల్ని పండించుకుంటున్నం. గదంత ఎందుకు పంట పండించేటోడే కరువైండు. ఇంక మందుల పంటలు, మంచి పంటల సంగతెక్కడిది. ఎవరైనా… పొలముంది కదా అని పంట పెడితే పెట్టిన సొమ్ము కూడా వస్తలేదు.

పదేళ్లక్రితం నాది గూడ ఇదే కథ. అప్పుడు… ఇందిర క్రాంతి పథకం కింద సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి కొందరు సార్లు వచ్చి మాకు శిక్షణ ఇచ్చిండ్రు. మా చుట్టుపక్కల రైతులంతా మంచిగ విని ఊకుండ్రు. నాకు మాత్రం నచ్చి మా చేన్ల చాన ప్రయోగాలు చేసిన. ఇంకెవరో వచ్చి పాత పంటలకు ఇప్పుడు మస్తు గిరాకి ఉందని చెబితే వాటి గురించి ఆలోచన జేసిన’’ అంటూ తన తొలి అడుగుల గురించి పూసగుచ్చినట్టు వివరించింది లలితమ్మ.

కొర్రలు, సామలు, తైదలు, పచ్చసజ్జలు, నల్లనువ్వులు వంటి పాత పంటల్ని పండించి పట్టణాలకు ఎగుమతి చేయడం సుస్థిర వ్యవసాయంలో లలితమ్మ ప్రత్యేకత.

ఎరువుల రహస్యం…

 వ్యవసాయం పేరు చెప్పగానే రైతులకు రసాయన ఎరువుల ధరలు గుర్తుకొస్తాయి. ఏళ్ల అనుభవం ఉన్న రైతులు కూడా వ్యవసాయం పేరు చెప్పేటప్పటికి చేతులెత్తేసే పరిస్థితుల్లో లలితమ్మ అద్భుతమైన లాభాలు గడిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆమె సొంతంగా తయారుచేసుకుంటున్న సేంద్రీయ ఎరువులే. వాటి వెనకున్న రహస్యం కనుక్కోడానికే సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ)వారు ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి కలెక్టర్ల ముందు కూర్చుబెట్టారు.

‘‘ఢిల్లీల కలెక్టర్లకు నా వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పినంక ఒకాయన లేచి నేను తయారుచేసే ఘనజీవామృతం ఎరువు గురించి అడిగిండు. ఎట్లచేయాలో కూడా చెప్పమన్నడు. అన్నీ వివరంగా చెప్పినంక అందరూ లేచి నిలవడి తప్పట్లు కొట్టిండ్రు. వాళ్లనట్ల జూసేసరికి వంద ఎకరాలల్ల పంట ఊడ్చినంత సంతోషమొచ్చింది’’ అని ఎంతో గర్వంగా చెప్పిన లలితమ్మ కళ్లలో ఆకలి తీర్చే రైతన్నతో పాటు, తెలిసిన విద్యను పదిమందికి పంచిపెట్టే గురువు కూడా కనిపించాడు.

ఘనజీవామృతం అంటే…పొలానికి వాడే సేంద్రీయ ఎరువు. ‘‘పది కిలోల పెండల రెండు కిలోల పప్పుల పొడి, రెండు కిలోల బెల్లం, ఒక కిలో పుట్టమట్టి, మూడు లీటర్ల ఆవు మూత్రం బోసి బాగ కలిపి ఎండవెట్టాలి. పది దినాల తర్వాత అది చాయిపత్త పొడిలా అయితది.. దాన్నిపొలంల యిత్తులు పెట్టినపుడు, కలుపుతీసినపుడు సల్లితే మొక్కలు దొడ్డుగ వెరుగుతయి. గీ సంగతే ఢిల్లీల కలెక్టర్లతో చెప్పిన. వాళ్లు  పుస్తకంల రాసుకున్నరు’’ అని తన ఎరువుల తయారీ గురించి చెప్పింది లలితమ్మ.

 అన్నీ తానై….

 సుస్థిర వ్యవసాయం అంటే ఎరువుల్ని, విత్తనాల్ని రైతులే తయారుచేసుకోవాలి. ఓపికుంటే అమ్మకాలు కూడా రైతులే చేసుకుంటే పెట్టుబడిలేని వ్యాపారంలా సాగుతుంది. లలితమ్మ విజయం వెనకున్న కారణాలు ఇవే. తనకోసం మాత్రమే కాదు ఆ చుట్ట్టుపక్కల యాభై మంది రైతులకు సేంద్రీయ విత్తనాలను, ఎరువుల్ని అమ్ముతుంది కూడా. ప్రస్తుతం ఆమె పదమూడు రకాల సేంద్రీయ పంటల్ని పండిస్తోంది. అమ్మకం పని కూడా తనదే. దళారీల ప్రసక్తే రానివ్వదు.

‘‘పొలముంది కదా అని ఒకటే రకం పంట ఏసుకుంటే బొమ్మ బొరుసులెక్క ఉంటది. అట్లగాకుండా నాలుగైదు రకాల పంటలేసుకుంటే అమ్ముకోడానికి బాగుంటుంది. ఒకదాన్ల నష్టమొచ్చినా ఇంకోదాన్ల లాభమొస్తది. మన దగ్గర రైతులు ఎక్కువ తలకాయి నొప్పిలేకుండా పంట పండాలంటరు. వ్యవసాయంలా ఎంత ఓర్పు ఉంటే గంత లాభముంటది. పంట సరిగ రాకుంటే దేవుడా….అంట కూసుంటరు. మొక్క లేవకుంటే ఎంబడే పీకేసి కూరగాయలు పెట్టుకుని మార్కెట్‌కి ఏస్కుంటే కాలం కలిసొస్తది, సొమ్ములొస్తయి’’ లలితమ్మ ఆలోచనతో కాదు…అనుభవంతో చెప్పిన మాటలివి.

ఐదేళ్లపాటు పాతపంటలపై రకరకాల ప్రయోగాలు చేసి, ఆ తర్వాత ఐదేళ్లలో సేంద్రీయ పంటల్లో ఎవ్వరూ ఊహించని విజయాలు సాధించింది. అందుకుగానూ మూడేళ్లక్రితం ప్రభుత్వంవారు ఉత్తమరైతు అవార్డు కూడా ఇచ్చారు.

తోటి రైతులకు…

 కొర్రలు తింటే స్థూలకాయం తగ్గుతుంది. సజ్జలు మంచి న్యూట్రిషన్, తైదలు శక్తినిస్తాయి. మరివన్నీ ఎక్కడ దొరుకుతాయి? అక్కడక్కడ తప్ప ఎక్కడబడితే అక్కడ అందుబాటులో లేవు. ఈ విషయాన్ని గ్రహించిన లలితమ్మ లాభాలరైతుగా పేరు తెచ్చుకుంది.

ఆమె విత్తనాలకు, ఎరువులకు, ఆహార ధాన్యాలకు విపరీతమైన గిరాకి ఉంది. అలాగని లలితమ్మ తన వ్యవసాయాన్ని పదుల ఎకరాలకు విస్తరింపచేయలేదు. తనకున్న నాలుగెకరాల్లోనే ప్రయోగాలైనా, పంటలైనా. తన వ్యవసాయ పనులతో పాటు తన గ్రామంలో ఉన్న రైతులకు, చుట్టుపక్కల సేంద్రీయ పద్ధతుల్లో పంటలు వేసే రైతులకు లలితమ్మ ఉచితంగా శిక్షణ ఇస్తోంది.  ఏ రైతుకొచ్చిన ఇబ్బంది అయినా, సందేహమైనా తీర్చేవరకూ లలితమ్మకు నిద్ర పట్టదు. మొక్క పెట్టే దగ్గర నుంచి మార్కెట్ కెళ్లేవరకూ ఆ చుట్టుపక్కల రైతులకు లలితమ్మ అండగా నిలబడుతుంది. గురువులు పాఠాలు మాత్రమే చెబుతారు. లలితమ్మ పాఠాలు చెపుతూనే ప్రాక్టికల్స్ చేసి చూపిస్తోంది. వాటిలో పొరపాటు జరక్కుండా కాపాడుతుంది కూడా. అందుకే ఈమె టీచింగ్‌కి కాబోయే  కలెక్టర్లుసైతం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

 – భువనేశ్వరి

 ఫొటోలు: వై. శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్

మంచి చేసే వాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు..

koteswrmma
ప్రజాయుద్ధంలో ఆరితేరిన ‘నిర్జన వారధి’ కొండపల్లి కోటేశ్వరమ్మ. ఆవిడ పోరాటం బాల్యం నుంచే మొదలైంది. కొండపల్లి సీతారామయ్య సహచరిణిగా కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వామురాలై.. ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా చలించక ఎంచుకున్న మార్గంలోనే నడిచిన ధీర మహిళ ఆమె. నూరేళ్ల జీవితానికి అయిదు అడుగుల దూరంలో ఉన్న కోటేశ్వరమ్మ.. తన జీవన ఆరోగ్య సూత్రాలను ఇలా చెప్పుకొచ్చారు..
‘ఇతరులకు అపకారం చేయని వారు, సమాజానికి మేలు చేసే వారు ఎక్కువ కాలం బతుకుతారు..’ అని నాతో ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య చెప్పారు. ఈ వాక్యాలు నా విషయంలో నిజమేమో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే నేను ముందుకు నడిచాను. ఇంత కాలం ఆరోగ్యంగా బతకడానికి బహుశా అదే కారణం అయ్యుంటుంది. పరుల కోసం పాటు పడాలన్న తపన మరికొంత కాలం జీవించేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. చాలా మంది మాదిరిగానే నా జీవితంలోను అనేక కష్టాలు ఎదురయ్యాయి. నా కుమారుడు చందును పోలీసులు మాయం చేసినప్పుడు, నా కుమార్తె కరుణ మానసిక వేదన భరించలేక మరణించినప్పుడు- ఇంకా ఇలా రకరకాల కష్టాలు వెంటాడుతున్నప్పుడు- అనేక మంది మిత్రులు నాకు తోడుగా నిలిచారు. అలాంటప్పుడు- కార్యశూరులు, త్యాగధనులనిపించుకున్న మహనీయుల స్ఫూర్తితో మనిషి ఉత్తేజితుడవుతాడేమో.. వారి ఓదార్పు ఊపిరులూదుతుందేమో అనిపిస్తుంది. ఆ కారణంతోనే నేను ఇన్నాళ్లు జీవించానేమోనని కూడా అనిపిస్తుంది. కొందరు వృద్ధాప్యం నరకంలాంటిదంటారు. రకరకాల సమస్యలతో బాధపడుతూ నిరాశతో నిత్యం బతుకుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి కన్నా- మంచి పనిచేశాననుకుంటూ, మనిషిలా బ్రతికాననుకుంటూ మనశ్శాంతితో కన్నుమూయటం మంచిదేమో అనిపిస్తుంది. ఇలా బతకాలంటే మానసికంగా ధృడంగా ఉండాలి. మానసికంగా బలంగా ఉంటే సమయానికి తిండిలేకపోయినా, నిద్ర లేకపోయినా అనారోగ్యం దరిచేరదు.
మానసిక స్థయిర్యమే ప్రధానం..
సంస్కరణోద్యమం కారణంగా వీరేశలింగం ప్రభావం మా కుటుంబంపై తీవ్రంగా ఉండేది. అందుకే బాలవితంతువైౖన నాకు కొండపల్లి సీతారామయ్యతో వివాహం జరిగింది. ఆయన స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నా. సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో చురుకైన పాత్ర వహించేదాన్ని. ఉద్యమాలంటే తెలిసిందే కదా! సమయానికి తిండి దొరకదు. నిద్ర ఉండదు. ఇక యూజీ (అండర్‌ గ్రౌండ్‌)లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వైపు ఉద్యమాలలో పాల్గొనేటప్పుడు కలిగే ఒత్తిడి ఒక ఎత్తు అయితే- వ్యక్తిగత జీవితంలో నాకు ఎదురయిన సవాళ్లు మరో ఎత్తు. అలాంటి సమయంలో కూడా నాకు ఎదురయిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నానంటే- నా మానసిక సైర్థ్యమే ప్రధాన కారణం.
నలభై ఏళ్లు హాస్టల్‌లోనే..
ఉద్యమాల సమయంలో తిండి, నిద్ర ఉండేది కాదని చెప్పాను కదా. ఆ తర్వాత ఎక్కువ కాలం హాస్టల్‌లో ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే హాస్టల్‌ అంటే క్రమశిక్షణ. సమయానికి తిండి ఉండేది. నిద్ర ఉండేది. దీనితో తిండి విషయంలో క్రమశిక్షణ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ! చిన్నప్పటి నుంచి నేను శాకాహారిని. ఏ రోజూ ఆహార నియమాలను పాటించలేదు. ఇది తినకూడదు, అది తినకూడదు అన్న నిబంధనలేవీ లేవు నాకు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మితాహారిగా మారాను. అవసరం మేరకే తింటున్నాను. ఏదైనా నచ్చింది కదాని మితిమీరి తినే అలవాటు లేదు. రాత్రి పడుకునే ముందు మాత్రం పుస్తకాలు చదువుతాను. దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది. వీటన్నిటికీ తోడు.. నన్ను అభిమానించేవాళ్లను ఎంతో మందిని సంపాదించుకోగలిగాను. ప్రేమించేవారిని పొందగలిగాను. వారి ఆత్మీయానురాగాలే నాకు కొండంత బలం అనిపిస్తుందిప్పుడు. ఆ బలం ముందు నేను పడిన కష్టాలు చిన్నవైపోయాయి. ఎంచుకున్న మార్గంలో రాజీపడకుండా నడిచి.. సంఘసేవలో తరించానన్న సంతృప్తితోనే నేటికీ ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను.
బాధాకరమైన సంఘటనలు, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. ఎందుకంటే అసలే ఆ సమయంలో ఎవరైనా బలహీనంగా ఉంటారు. దానికి తోడు మరింత కుంగిపోతే మరీ బలహీనపడతారు. ఆ వెనకే అనారోగ్యం చుట్టుముడుతుంది.
జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఉన్నంత కాలం సంతృప్తిగా బతకడమే తెలుసు. ఆ సంతృప్తే జీవాయుష్షును పెంచుతుంది అన్నది నా అభిప్రాయం.
మంచి పని చేశాననుకుంటూ, మనిషిలా బతికాననుకుంటూ.. మనశ్శాంతితో కన్ను మూయడం మంచిది అనిపిస్తుంది..
నా జీవిత చరిత్ర ‘నిర్జన వారధి’కి సంబంధించిన రాయల్టీని రెండు సంస్థలకు విరాళంగా ఇచ్చాను. ఇటువంటి పనులు సంతృప్తిని ఇస్తూ ఉంటాయి.
ఉద్యమ నేపథ్యం..
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాల్య వితంతువును. ఆ రోజుల్లో నేను చదివింది కేవలం ఎనిమిదో తరగతే! పాటలు బాగా పాడేదాన్ని. దీంతో అందరూ నన్ను ‘నైటింగేల్‌.. నైటింగేల్‌’ అంటూ ఏడిపించేవారు. ఆ బాధ పడలేక చదువు మానేశాను. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. జాతీయోద్యమంలో పాల్గొనడం బాధ్యతగా భావించేవారు. ఆ విధంగా నాలుగు ఉద్యమాల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి అదే నా జీవనమార్గం అయ్యింది. సీతారామయ్యగారితో వివాహం అయిన తర్వాత సీ్త్ర విద్య, జాతీయోద్యమం, నగ్జల్‌బరీ, సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నాను. మా సంస్థలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించినప్పుడు.. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాం. ఈ ఉద్యమ సమయంలోనే నా భర్త దూరమయ్యాడు. నా బంగారమంతా పార్టీకి ఇచ్చేశాను. ఇద్దరు పిల్లలను పోషించలేని దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నా. పిల్లలు నాకు దూరంగా ఉన్న సమయంలో- వాళ్లకు కథలు చెబుతున్నట్లు ఊహించుకుంటూ- ‘అమ్మ చెప్పిన కథలు’ రాశాను. ఆ తర్వాత కూడా అనేక రచనలు చేశాను. వాటికి లభించిన ప్రశంసలు నా ఆయుష్షును మరింత పెంచాయనిపిస్తుంది! ఇప్పుడు పుస్తకం నాకు తోడు.. నాకున్న గొప్ప నేస్తం. అందుకే వైజాగ్‌లో జరుగుతున్న పుస్తకప్రదర్శనకు కూడా వెళ్లా.. ఆ పుస్తకాలను చూస్తుంటే కొత్త శక్తి వచ్చినట్లనిపించింది.
వాసు, విశాఖపట్టణం
ఫోటోలు : విజయ్‌

పద్యాల చిన్నయసూరి

19vzrdv01Mother_20_2316798g

 

పద్యం తెలుగువారికే ప్రత్యేకమైన ఆస్తి. కందం, ఆటవెలది, తేటగీతి, మత్తేభం, ఉత్పలమాల, చంపకమాల, సీసం… ప్రతి ఛందస్సుదీ ప్రత్యేకమైన అందం. వజ్రాలు వరసగా పేర్చినట్టు, రత్నాలు రాశులు పోసినట్టు, చెరువులో ఎర్ర కలువలు పూచినట్టు, ఆకాశంలో నక్షత్రాలు వెలిగినట్టు… అలతిఅలతి పదాలతో అల్లిన మాలలు మన పద్యాలు. “అంత విలువైన ఆస్తిపాస్తులను భావి తరాలకు అందించాలనే నా తపన” అంటున్నారు విశాఖపట్నానికి చెందిన పరవస్తు ఫణిశయన సూరి. ‘వారం వారం పద్య విహారం’ పేరిట ఆయన చేస్తున్న ప్రయత్నానికి బాలల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

పరవస్తు ఫణిశయన సూరి. ‘పేరెక్కడో విన్నట్టుగా ఉంది’ అన్నారంటే మీకు తెలుగు గురించి కొంచెం తెలిసినట్టే. ‘పరవస్తు చిన్నయసూరికి ఈయన ఏమవుతారు’ అని అడిగారనుకోండి, అప్పుడు మీకు భాష గురించి బాగా తెలిసినట్టు. తెలుగు భాషకు వ్యాకరణ కిరీటాన్ని పెట్టిన పరవస్తు చిన్నయసూరికి ఈ ఫణిశయన సూరి ఐదో తరం మనవడు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న మనుషులున్న ఈరోజుల్లో కాయకష్టం చేసి దాచుకున్న సొమ్మును తెలుగు పద్యాల వ్యాప్తికి ఖర్చు చేస్తానంటున్న ‘అ’సామాన్యుడాయన.

కోటిచ్చినా నోటికొస్తుందా…
పూర్వం అక్షరాభ్యాసానికి పూర్వమే పిల్లలకు పద్యాలు నోటికొచ్చేవి. ఉదయాన్నే లేచి పనిచేసుకుంటూ పద్యాలను వల్లించుకునే బామ్మల నుంచో, రాత్రి పూట పద్యపఠనం చెయ్యకుండా పడుకోలేని తాతల నుంచో వినీవినీ వారికి అవి ఒంటపట్టేవి. ‘శ్రీరాముని దయచేతను….’ ‘నీ పాద కమలసేవయు…’ ‘ఉప్పుకప్పురంబు….’ ఒకటారెండా, ఒకటో తరగతిలో చేరేనాటికి తక్కువలో తక్కువ పాతిక పద్యాలయినా కంఠస్థమయి ఉండేవి చిన్నారులకు. ఇప్పుడా పరిస్థితి లేదు. “అలాగని తెలుగు పద్యాలను మరిచిపోతామా చెప్పండి? అపూర్వమైన నిధి కదండీ మన పద్యాలంటే? వాటిని పిల్లలకు నేర్పించకపోతే ఎలా?” అంటూ ఆ పనికి తానే ముందడుగేశారు.

‘వారం వారం పద్య విహారం’ అనే శీర్షికతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పౌర గ్రంధాలయం వేదిక అయింది. ‘పద్యం నేర్చుకోండి, పది రూపాయలు అందుకోండి’ అన్న నినాదంతో మొన్న వేసవి నుంచి ఆయన చేపట్టిన ప్రచారం చిన్నారుల్లో మంచి ఉత్సాహాన్నే నింపింది. ఏప్రిల్‌లో మొదలైన ఈ కార్యక్రమానికి దాదాపు 550 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆర్నెల్లు తిరిగేసరికల్లా… 300 మంది వివిధ వయసుల విద్యార్థులు ఒక్కొక్కరూ పాతిక నుంచి రెండొందల వరకూ పద్యాలను నేర్చుకున్నారు! వాళ్లకు సుమారు యాభై వేల రూపాయలను బహుమతులుగా ఇచ్చారు ఫణిశయన సూరి. అలాగని ఇది డబ్బు కుమ్మరిస్తే అయిపోయే పని కాదు. కోటి రూపాయలు పోసినా నోటికో పద్యం రావాలంటే చాలా తతంగం ఉంది.

‘పద్య విహారం’ కార్యక్రమం విజయవంతం కావడానికి సూరి చాలా పరిశ్రమించారు. “మా తెలుగు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతో ముందుగా తె లుగు సాహిత్యంలో అపూర్వ వజ్రాల వంటి పద్యాలను ఎంపిక చేసే పనిలో పడ్డాం. దేనికదే అపురూపంగా ఉండేది. ప్రతి పద్యాన్నీ చదువుతున్నప్పుడు దాన్ని పిల్లలకు ఎలాగైనా నేర్పించాలనిపించేది. ఏ కవినీ వదిలెయ్యాలనిపించేది కాదు. అబ్బో, అదొక విచిత్రమైన అవస్థ …’ అంటున్న సూరి మొత్తానికి తొలిమెట్టుగా ఒక ఐదు వందల పద్యాలను పోగుచేశారు. పిల్లలకు అర్థమయ్యేలా విడివిడి కాగితాల మీద రాసి నకలు తీయించారు.

తెలుగులో చదవలేని ఇంగ్లీష్ మీడియమ్ వారికైతే ఇంగ్లీష్‌లోనే రాసిచ్చారు. అర్థం చెబుతూ పద్యాన్ని చదవడంలో శిక్షణనిచ్చారు బాలలకు. “వేసవి శిబిరం బాగా నడుస్తుందా లేదా అని ఆందోళనగా ఉండేది. మొదట్లో తల్లిదండ్రులు బలవంతపెడితే, కొద్ది మందొచ్చేవారు. నెమ్మదిగా వాళ్లంతటవాళ్లుగా రావడం పెరిగింది. వేసవి శిబిరం తర్వాత ఆపేద్దామనుకున్న మేం ఇప్పుడు పద్య విహారాన్ని వారం వారం హాయిగా కొనసాగిస్తున్నామంటే బాలల్లోని ఆదరణే దానికి కారణం” అంటున్నారు సూరి.

అపర భువన విజయం
ఎల్‌కేజీ నుంచి పదో తరగతి దాకా – వివిధ వయసుల బాలలు పూర్వ కవుల పద్యాలను గడగడా చదువుతుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంటుంది. “చిన్నారులు తప్పుల్లేకుండా భావయుక్తంగా పద్యాలు చదువుతుంటే ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను…” అంటున్న ఫణిశయన సూరిలో ఆ ఆనందామృతాన్ని పదిమందికీ రుచి చూపించాలనే ఆలోచన కలిగింది. తన శిక్షణలో బాలలు సొంతం చేసుకున్న పద్య సంపదను పదిమందిలోనూ ప్రదర్శిస్తూ ‘తెలుగు పద్య విజయం’, ‘తెలుగు పద్యం – వ్యక్తిత్వ వికాసం’ అన్న శీర్షికలతో ఇప్పటికీ రెండు భారీ కార్యక్రమాలు నిర్వహించారు.

రెండిటిలోనూ నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన , మొల్ల… వంటి మహామహుల రూపాలను ధరించిన పిల్లలు… సాక్షాత్తూ ఆ కవులు భువికి దిగి వచ్చారా అన్నంత ధారణతో పద్యాలను చదువుతుంటే సభాసదులు పులకరించిపోయారు. ఇవన్నీ చేస్తున్నారు కదాని సూరి ఏమీ ఆగర్భశ్రీమంతుడు కాదు.

వివాహాది శుభకార్యాల్లో పువ్వుల అలంకరణ చేసే వృత్తికి తోడు అప్పుడప్పుడు ఆర్ట్ డైరెక్టర్‌గా సినిమాలకూ పనిచేస్తుంటారు. పద్య విహారం కనీసం రెండేళ్ల పాటు నిర్విఘ్నంగా జరగడానికి ఐదు లక్షల రూపాయల నిధిని సొంతంగా సమకూర్చుకున్నాకే తొలి అడుగు వేశారాయన. “ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చమని నేనుగా ఎవరినీ అడగదల్చుకోలేదు.. పద్యం పట్ల అభిమానంతో ఎవరైనా ఇస్తే కాదనను” అంటున్న సూరి ప్రయత్నం ఎంతోమందికి మార్గదర్శకం.

మన తెలుగు పద్యాల గొప్పదనాన్నీ, వాటి అందచందాలనూ ఈ తరానికి తెలియజెప్పే శీర్షికలు కొన్ని పత్రికల్లోనూ విజయవంతంగా నడుస్తున్నాయి. ‘ఈమాట’ వెబ్ మ్యాగజిన్‌లో విజయవాడవాసి చీమలమర్రి బృందావనరావు చక్కటి పద్యాలను ఏర్చి కూర్చి కొన్నేళ్లుగా పాఠకులకు పరిచయం చేస్తున్నారు. అటువంటిదే మరో ప్రయత్నం గుంటూరుకు చెందిన రచయిత పాపినేని శివశంకర్ చేశారు.

అమెరికాలో వెలువడే ‘తెలుగునాడి’ మాస పత్రిక పాఠకుల కోసం ఆయన పరిచయం చేసిన అనర్ఘ రత్నాల వంటి పద్యాలు, వాటి వివరణలనూ ఒకచోట చేర్చి ‘తల్లీ నిన్నుదలంచి’ అన్న పుస్తకాన్ని ఈమధ్యే విడుదల చేశారు. “ప్రాచీన సాహిత్యంలో జీవధాతువుగల అమూల్య పద్యాలెన్నో కనపడతాయి. అవి మానవ సంబంధాల్ని నిర్వచించి వ్యాఖ్యానిస్తాయి. విద్యార్థులు మొదలు గృహస్థుల దాకా అందరికీ జీవనకళ నేర్పుతాయి. జీవిత సంస్కారాన్ని పండిస్తాయి. అంతిమంగా ఒక ఆరోగ్యదాయకమైన వ్యక్తిగత, సామాజిక సంస్కృతిని పాదుగొల్పుతాయి…” అని తెలుగు పద్య నిధిని తలుచుకొని మురిసిపోతున్నారు పాపినేని శివశంకర్.ఫణిశయన సూరి : 9440682323

– అరుణ పప్పు, విశాఖపట్నం

ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే!

తొలి సినిమా నుంచే తనదైన పంథాలో పయనించిన యువదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘గ్రహణం’ సినిమాతో తొలిదర్శకుడిగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నా, ఆ తర్వాత తీసిన ‘మాయాబజార్’తో పరాజయం చవిచూశారు. విమర్శలే కాదు పలురకాల ఆత్మవిమర్శలతో రాటు తేలిన పిదప ఆయన తీసిన ‘అష్టాచమ్మా’ సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ‘గోల్కొండ హైస్కూలు’ సినిమా ఒక మోస్తరుగా నడిచినా ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు- ఆ తరువాత’ మళ్లీ విజయాన్ని కట్టబెట్టింది. దశాబ్ద కాలపు సినీ జీవితంలో మోహనకృష్ణకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.

bharani
కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉన్నా, టీచింగ్‌లోకి వెళ్లొచ్చని పిహెచ్.డిలో చేరినా అంతిమంగా సినిమా రంగం పట్ల నాకున్న ఇష్టం నన్ను ఒక దర్శకుడిగా నిలబెట్టింది. మా నాన్న శ్రీకాంత శర్మ గారి కారణంగా ఇంట్లో ఏర్పడిన సాహిత్య వాతావర ణం, మా అమ్మ జానకీబాలగారి కారణంగా ఏర్పడిన సంగీత వాతావరణం బహుశా నేను ఈ వైపు రావడానికి ప్రధాన కారణమేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది.

1997లో నేను 50 ఏళ్ల భారత స్వాతంత్య్రం సందర్భంగా ‘మహాంధ్ర’ అన్నపేరుతో ఒక డాక్యుమెంటరీ చేశాను. దాదాపు 1870 నుంచి 1947 వరకు రాష్ట్రంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, ఇతరత్రా వచ్చిన మార్పులేమిటి? అన్న విషయం తీసుకుని ఆ డాక్యుమెంటరీ చేశాను. జెవి సోమయాజులు నిర్మాతగా వ్యవహరిస్తే పవన్‌కుమార్ మాన్వి దానికి దర్శకత్వం వహించారు. దానికి సంబంధించిన పరిశోధన, రచన నేనే చేశాను.

సినిమా గురించిన ఒక అవగాహన కలిగించింది ఆయనే. అందువల్ల సినిమా లోకానికి సంబంధించినంత వరకు మాన్విగారు నా తొలిగురువు. సినిమా రచన గురించి, దర్శకత్వం గురించి ఎన్నో విషయాలు నేను అయన నుంచి నేర్చుకున్నాను. ఆయన సలహా మీదే కెనడా వెళ్లి అక్కడో యూనివర్సిటీలో ఎం. ఎఫ్.ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ) చేశాను. ఆ తరువాత పిహెచ్.డిలో జాయిన్ అయ్యి ఒక సంవత్సరం ఉండి అంటే 2001లో సినిమా చెయ్యాలని నిర్ణయించుకుని ఇండియాకు తిరిగి వచ్చేశాను.

అడుగు మోపాకే తె లిసిందిసినిమా రంగంలో అడుగిడిన నాటి నుంచే మొదలయ్యాయి నా కష్టాలు. ఎవరికైనా ప్రత్యక్షంగా ఆ రంగ ంలోకి దిగేదాకా దానికి సంబంధించిన కష్టాలేం తెలుస్తాయి! కనిపించిన ప్రతి నిర్మాతకూ కథలు వినిపించేవాడ్ని. అలా ఓ మూడేళ్లు గడిచాయి. కానీ, ఎక్కడా సానుకూల స్పందన లేదు.

ఒక్కోసారి అనవసరంగా ఇండియాకు తిరిగొచ్చేశానేమో అనిపించేది. ఏమైనా ఈ రంగంలోకి ప్రవేశించడం అంటే ఏటికి ఎదురీదడమేనని నాకు అర్థమైపోయింది. ఎవరి వద్దకు వెళ్లినా ‘ సరేలేవయ్యా, విదేశాలకు వెళ్లానంటున్నావు. బాగా చదువుకున్నానంటున్నావు. కానీ, అసలు నువ్వు సినిమా తీయగలవని మాకు నమ్మకమేంటి? ఇంత వరకు నువ్వు ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. ఏం చిత్రిస్తావో మాకేం తెలుసు? ఇప్పుడు నీ మీద అంత డబ్బు ఎలా పెడతాం?” అంటూ అడి గేవాళ్లు.

అదీ నిజమేననిపించింది. నువ్వేమిటో, నీ సామర్థ్యం ఏమిటో ఏమీ తెలియకుండా ఎవరైనా లక్షల్లో, కోట్లలో ఎలా ఖర్చు చేస్తారు? మన మీద మనం ఖర్చు చేసుకుని మనల్ని మనం నిలబెట్టుకోవడం తప్ప మరోమార్గం లేదనిపించింది. వెంటనే అంటే 2003లో 30 నిమిషాల నిడివితో ‘చలి’ అనే చిన్న సినిమా (ఫీచర్ ఫిల్మ్) తీశాను.

నిర్మాతలు, దర్శకులు ఎవరు కనిపించినా వారికి ఒక సీడీ ఇచ్చే వాడ్ని. అది చూసి చాలా మంది బాగుందనే అన్నారు. తనికెళ్ల భరణి గారు కూడా చూశారు.అంతకు ముందే ఆయనతో నాకు కొంత పరిచయం ఉంది. చలం గారి రచన ఆధారంగా నేను తయారు చేసుకున్న ‘గ్రహణం’ అనే స్క్రిప్ట్ నా వద్ద ఉంది, అందులోని ప్రధానపాత్రను చేయడానికి మీరు అంగీకరిస్తే సినిమా చేద్దాము అన్నాను.

‘చలం గారి కథే అయితే చేస్తా. నాకు డబ్బులేమీ అక్కర్లేదు’ అంటూ వెంటనే ఒప్పేసుకున్నారు. ఈ మాటే అమ్మతో చెప్పాను. ‘మూడు లక్షల్లో తీయగలవా మరి?. నా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బ్రేక్ చేసి నీకు 3 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను’ అంది. వెనకా ముందు ఆలోచించకుండా సరే అన్నాను. ఆ మాటే భరణి గారికి చెబితే నవ్వేశారు. అలా కాదు గానీ, ఎలాగోలా ఇంకొంచెం పెంచుదాం అన్నారు.

మొత్తంగా చూస్తే అన్నీ కలిపి 18 లక్షల దాకా ఖర్చయ్యింది. అప్పుడు నేషనల్ అవార్డుకు పంపిస్తే, దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ తొలి దర్శకుడిగా నాకు అవార్డు వచ్చింది. అక్కడినుంచి కెరీయర్‌కు ఒక టేకాఫ్ దొరికింది.విజయం, సమస్య కలగలిసిగ్రహణం సినిమాతో నాకు బాగా పేరొచ్చిన మాట నిజమే కానీ, చిత్ర పరిశ్రమ నన్ను పూర్తిగా ఆర్డ్ ఫిలిం డైరెక్టర్ల జాబితాలో చేర్చివేసింది. మరో సినిమా చేసే అవకాశం నాకెవ్వరూ ఇవ్వలేదు.

నేను బాగా కష్టాల్లో పడిపోయాను.. నేను ఏ సినిమా తీసినా ‘గ్రహణం’ మూసలో తీస్తాననే ముద్ర ఒకటి పరిశ్రమ వేసింది. అయినా ఆ కష్టకాలంలో ‘మిస్సమ్మ’ తీసిన వి సత్యనారాయణ ఒక సినిమా తీద్దామని నా వద్దకు వచ్చారు. ఆయనతో చేసిందే ‘మాయాబజార్.’ కానీ, అది ఆశించినంత బాగా ఆడలేదు. దానికి రకరకాల కారణాలు చెప్పారు. కథ పాత పద్దతిలో ఉందని, కుర్రకారుకు అది పట్టలేదని, ఆదర్శాల పాలు ఎక్కువైపోయిందనీ అన్నారు.

వ్యక్తిగతంగా నాకు మాయాబజార్ సినిమా అంటే చాలా ఇష్టం కానీ కమర్షియల్‌గా విజయవంతం కాకపోవడంతో నేను మానసికంగా దెబ్బతిన్నాను. దాదాపు ఏడాది పాటు విపరీతమైన అంతర్మధనానికి గురయ్యాను.తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండిపోయాను. మనిషి మీద ఒక ముద్ర పడితే అది ఒక్కోసారి జీవితకాలపు ముద్ర అవుతుందని అప్పటిగ్గాని నాకు తెలిసి రాలేదు

.అది ఆయన సాహసమేఏం చేయాలో తోచక కొట్టుమిట్టాడుతున్న సమయంలో రామ్మోహన్ అనే ఒక స్నేహితుడు నాకోసం వెతుక్కుంటూ వచ్చాడు. రామానాయుడు స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా ఉండేవాడు. నేను తరుచూ ఆ స్టూడియోకు వెళ్లడం, కథలు చెప్పడం చేసేవాడ్ని. అలా పరిచయం అయిన వాడే అతను. ఆయన నా వద్దకు వచ్చి, నాకో సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉంది. ‘మాయాబజార్’ ఫెయిల్యూర్ విషయం పక్కకు పెట్టు. నాకు నీ టాలెంట్ మీద నమ్మకం ఉంది. మనం ఓ సినిమా చే ద్దాం అన్నాడు.

అప్పుడాయనకు నేను ‘అష్టాచమ్మా’ కథ చెప్పాను. ఆ సినిమా విడుదలై గొప్ప విజయం సాధించింది. ఆర్ట్ సినిమాలే కాదు ఇతను వినోదాత్మకంగా కూడా తీయగలడు అన్న భావనను పరిశ్రమలో స్థిరపరిచింది. ఈ క్రెడిట్ పూర్తిగా రామ్మోహన్‌కే దక్కుతుంది. ‘అష్టాచమ్మా’ విజయం తర్వాత అదే బ్యానర్ కింద ‘గోల్కొండ హైస్కూల్ ‘అనే సినిమా చేశాను. ఇది బ్లాక్‌బ్లస్టర్ కాకపోయినా, ఒక మేరకు సక్సెస్ సాధించింది.

కాకపోతే నాకు దర్శకుడిగా విపరీతంగా పేరొచ్చింది. ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాలో ఒక భిన్నత్వం ఉందని ప్రేక్షకులనుంచి ప్రశంసలొచ్చాయి.ప్రేక్షకుల సృష్టి జరగాలి’అష్టాచమ్మా’ విజయం నాకు ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. పేక్షకులకు ఏం కావాలా వాటిని మనం ఊహిస్తూ కూర్చోవడం కన్నా, మనం నమ్మిన దాన్ని ఎంత పక్కాగా తీయగలిగితే అది ప్రేక్షకుల్ని అంత తొందరగా చేరుతుందని అనిపించింది.

సినిమాలో వినోదం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎలాంటి వినోదం ఇవ్వాలనేది దర్శకుడు నిర్ణయించుకోవాలి. దర్శకుడు తన ప్రేక్షకుల్ని సృష్టించుకునే క్రమం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

హీనమైన వినోదం ఇస్తే ఆ స్థాయి ప్రేక్షకులే పుట్టుకొస్తారు. ఉన్నతమైన వినోదాన్ని ఇస్తే ఉన్నతమైన ప్రేక్షకులు పుడతారు.మనం తక్కువ సంస్కారవంతమైన వినోదానికి ఎక్కువ కాలం అలవాటు పడి వేరొకరకమైన వినోదాన్ని చూసి ఆనందించగల స్థాయి వారిలో తగ్గిపోవచ్చు. అలాంటి స్థితిలో అటువంటి వినోదంతో వ చ్చే సినిమాల్ని వారు అర్థం చేసుకోలేరు. వాటిని అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి, అభినందించడానికి వారికి టైం పడుతుంది.

అస్తమానం పడిపోతున్న విలువల విషయమై తిట్టుకుంటూ కూర్చోకుండా ఆ తరహా ప్రేక్షకుల్ని సృష్టించుకోవడం తప్పనిసరి అన్న సత్యం నాకు స్పష్టంగా బోధపడింది.

– బమ్మెరఫోటోలు: రాజ్‌కుమార్